Peddi: నార్త్ అమెరికాలో పెద్ది అడ్వాన్స్ బుకింగ్.. రిలీజ్కు ముందు రామ్చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Peddi Advance Booking: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ'పెద్ది'. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్నది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. తాజాగా నార్త్ అమెరికా ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్లో 'పెద్ది' నమోదు చేస్తున్న వసూళ్లు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్, సీనియర్ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్గా పని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ మూవీని సమర్పిస్తున్నాయి.

టాలీవుడ్లో ప్రస్తుతం భారీ బడ్డెట్ మూవీల్లో ఒకటిగా 'పెద్ది' నిలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 1980ల నాటి నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక సెట్స్ నిర్మించడం, భారీ స్థాయిలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చిత్రీకరణ జరపడం కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడం, 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ప్రీ రిలీజ్ బిజినెస్
సినిమాపై ఉన్న క్రేజ్కు తగ్గట్టుగానే పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాం ప్రాంత థియేట్రికల్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమాకు భారీ డిమాండ్ నెలకొంది. ఉత్తర భారతదేశంలో జియో స్టూడియోస్, కర్ణాటకలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, తమిళనాడు-కేరళ ప్రాంతాల్లో ప్రముఖ సంస్థలు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విడుదలకు ముందే సినిమా వ్యాపారం భారీ స్థాయిలో జరిగినట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల ద్వారా కూడా 'పెద్ది' భారీ ఆదాయం పొందినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే శాటిలైట్, ఆడియో హక్కులు కూడా రికార్డు స్థాయి ధరలకు అమ్ముడైనట్లు టాక్. మొత్తం మీద థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు కలిపి 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.500 కోట్లకు పైగా చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక అమెరికా మార్కెట్లో రామ్ చరణ్కు ఉన్న క్రేజ్ కారణంగా 'పెద్ది' ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్కు అద్భుత స్పందన లభిస్తోంది. ఓవర్సీస్ పంపిణీ హక్కులను భారీ చిత్రాల పంపిణీలో అనుభవం ఉన్న సంస్థలు సొంతం చేసుకున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవ్వగా, ప్రీ-సేల్స్ రూపంలోనే సినిమా మిలియన్ డాలర్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ చూస్తుంటే, 'పెద్ది' ఓవర్సీస్ మార్కెట్లో రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించే సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకూ నార్త్ అమెరికా మార్కెట్లో 'పెద్ది' సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలో 499 లోకేషన్లలో 1,534 ప్రీమియర్ షోలకు బుకింగ్స్ ఓపెన్ చేయగా, ఇప్పటికే 22వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ బుకింగ్స్ ద్వారా సినిమా 7 లక్షల డాలర్ల (700K Dollars) మార్క్ను దాటింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.6 కోట్లకు సమానం. విడుదలకు 4 రోజుల ముందే ఈ స్థాయి ప్రీ సేల్స్ రావడం సినిమాపై ఉన్న అంచనాలకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో 'ఆర్ఆర్ఆర్'తర్వాత రామ్ చరణ్కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిన ఫ్యాన్ బేస్ ను ఇదే నిదర్శనం. ఇప్పుడు అభిమానులందరి చూపు జూన్ 4పై ఉంది. బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications





