Radhe shyam : అన్ని కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి.. మొదటి రోజే 100 కోట్లా?
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ కోసం గత కొంతకాలంగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా తరువాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకోవడం, ఈలోపు బాహుబలిని తలదన్నేలా కాకపోయినా పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రావడంతో ఈ రాధేశ్యామ్ మీద అంచనాలు పెరుగుతున్నాయి. దానికి తోడు భారీ బడ్జెట్, రాజమౌళి లాంటి వారి సలహాలు సూచనలు తీసుకుని సినిమా రెడీ చేయడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్లు ఏ మేరకు ఉండనున్నాయి? అనేది పరిశీలిద్దాం.

పీరియాడిక్ లవ్ స్టోరీ
ప్రభాస్ పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం రాధేశ్యామ్. గోపీచంద్ తో జిల్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగానే విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది.

రిలీజ్ కావడం లేదని
అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఒక రేంజ్ లో చేస్తోంది ఈ సినిమా యూనిట్. తాజాగా రాజమౌళితో ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా వదిలారు. అయితే ఈ సినిమా థియేటర్స్ పరంగా పెద్ద షాక్ తగిలిందని అంటున్నారు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు....ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో రిలీజ్ కావడం లేదని అంటున్నారు.

థియేటర్ల సంఖ్య తక్కువ
ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో థియేటర్ల సంఖ్య తక్కువ అయిందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 860 థియేటర్లలో విడుదల చేయనున్నారు. అయితే గత సినిమాలతో పోలిస్తే అది తక్కువే. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సుమారు 1075 థియేటర్లలో విడుదల కాగా పుష్ప సుమారు 1150 స్క్రీన్లలో విడుదల చేయగా బాలకృష్ణ అఖండ కూడా 925 స్క్రీన్లలో విడుదలైంది. కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే థియేటర్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గడమే బాలేదని అంటున్నారు.

202.80 కోట్లకు
తెలుగు రాష్ట్రాల్లో 900 థియేటర్లలో, తమిళనాడులో 175, కర్నాటకలో 185, కేరళలో 150, హిందీ రెస్టాప్ ఇండియాలో 2200, ఓవర్సీస్లో 3400 థియేటర్లలో కలిపి మొత్తంగా 7010 థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రాధే శ్యామ్' సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రూ. 202.80 కోట్లకు అమ్ముడయ్యాయి.

100 కోట్ల క్లబ్లో
ఆ సంగతి పక్కన పెడితే అడ్వాన్స్ బుకింగ్ కింద ప్రభాస్ రాధే శ్యామ్ టికెట్లు చాలా ఏరియాల్లో అమ్ముడయ్యాయని వినికిడి. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్ సహా తెగుతున్న టిక్కెట్లను బట్టి చూస్తే రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రూ. 35 కోట్లు రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు మొదటి రోజునే 50 లేదా 100 కోట్ల క్లబ్లో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











