Pushpa 2 The Rule Closing Collections: 1800 కోట్ల కలెక్షన్స్ .. పుష్ప 2కి లాభమెంత? నష్టమెంత?
తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన చిత్రం పుష్ప 2 ది రూల్. 2024 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో పుష్ప 2 ది రూల్పై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు అల్లు అర్జున్. దీంతో పుష్ప 2 లాభాల్లోకి రావాలంటే రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టాలని బ్రేక్ ఈవెన్ టార్గెట్గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు
గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11 వేల థియేటర్లలో రిలీజై మరో రికార్డు అందుకుంది పుష్ప 2.. తొలి రోజే రూ. 294 కోట్ల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 61 రోజుల వరకు రూ.1800 కోట్లకు పైగా రాబట్టింది పుష్ప 2. ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ అందుకున్న పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.230 కోట్లకుపైగా లాభాలను పంచి పెట్టింది.

పఠాన్, జవాన్, కల్కి 2898 ఏడీ, స్త్రీ 2, కేజీఎఫ్ 2 , ఆర్ఆర్ఆర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల కలెక్షన్ల రికార్డులను అధిగమిస్తూ దూసుకెళ్లాడు అల్లు అర్జున్ . తద్వారా భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో టాప్ 5లో నిలిచింది పుష్ప 2. ఇన్ని రికార్డులు సాధించినప్పటికీ పుష్ప 2కి కొన్ని ఏరియాలలో నష్టాలు రావడం విశ్లేషకులను షాక్కు గురిచేసింది. ప్రధానంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నష్టాలు మూటకట్టుకుంది. కేరళలో పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వసూలు చేయకపోగా.. తమిళనాడులో తొలి రెండు వారాలు దుమ్మదులిపి తర్వాత చల్లబడిపోయింది. కర్ణాటకలో మాత్రం పుష్ప 2 బ్రేక్ ఈవెన్ అయ్యింది.
ఇక అల్లు అర్జున్కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో భారీ టార్గెట్ను అందుకున్నప్పటికీ పెట్టుబడి మీద నామమాత్రపు లాభాలే వచ్చాయి. ఇక ఓవర్సీస్లోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. అక్కడ తెలుగు వెర్షన్ ఓకే అనిపించుకోగా.. హిందీ వెర్షన్ మాత్రం అంచనాలను మించి రాణిస్తోంది. ఎప్పుడో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవాల్సిన పుష్ప 2.. రీ లోడెడ్ వెర్షన్ కారణంగా 50 రోజులకు పైగా నడిచింది. జనవరి 30న నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో అందుబాటులోకి రావడంతో పుష్ప 2 థియేటర్ పరుగు ముగిసినట్లే. కాకపోతే హిందీ బెల్ట్లోని కొన్ని ఏరియాలలో ఈ సినిమా మంచి ఆక్యూపెన్సీ సాధిస్తోంది. మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్, షేర్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద పుష్ప 2 ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ వందల కోట్ల ప్రాఫిట్ కళ్ల జూసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











