Mrithyunjay Day 3 Collections: వీకెండ్లో కుమ్మేసిన మృత్యుంజయ్.. శ్రీవిష్ణు మూవీకి ఎన్ని కోట్లంటే?
Mrithyunjay Box Office Collections: టాలీవుడ్లో కథా వైవిధ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకుని సినిమాలు చేసే నటుల్లో శ్రీ విష్ణు ఒకరు. కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా కొత్త కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన తాజా సినిమా 'మృత్యుంజయ్'. యాక్షన్- ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఇందులో ఉన్న సస్పెన్స్, ట్విస్టులు సినీప్రియుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
థ్రిల్లర్ కథతో తెరకెక్కిన సినిమా
'మృత్యుంజయ్' చిత్రానికి శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోగా శ్రీ విష్ణు నటించగా, ఆయన సరసన హీరోయిన్గా రెబ్బా మోనికా జాన్ కనిపించారు. కీలక పాత్రల్లో రచ్చ రవి, సిజ్జు, మిర్చి మాధవి, సుదర్శన్, కృష్ణ కౌశిక్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. సంగీతాన్ని కాలభైరవ అందించగా, సినిమాటోగ్రఫీని విద్యాసాగర్ చింతా నిర్వహించారు. ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.

మర్డర్ మిస్టరీ చుట్టూ కథ
ఈ సినిమా కథ ఒక అనుమానాస్పద మరణం చుట్టూ తిరుగుతుంది. విక్రాంత్ అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ ఘటనతో అతని చిన్నారి ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ చిన్నారి మౌనం వెనుక దాగి ఉన్న రహస్యం కథలో కీలక అంశంగా మారుతుంది. ఈ సమయంలో జై అనే యువకుడు (శ్రీ విష్ణు) తన స్నేహితుడి మరణం వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకుంటాడు. క్రైమ్ బ్యూరోలో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించినా విఫలమవుతాడు. అయినప్పటికీ స్వయంగా విచారణ ప్రారంభించి ఆ మర్డర్ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఆ మరణం వెనుక అసలు నిజం ఏమిటి? దానికి బాధ్యులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడమే కథ యొక్క ప్రధాన భాగం.
థియేట్రికల్ బిజినెస్ వివరాలు
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'మృత్యుంజయ్'సినిమా సుమారు రూ.20 కోట్లలోపు బడ్జెట్తో తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.6 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో నైజాం ప్రాంతం నుంచి దాదాపు రూ.2.5 కోట్లు, సీడెడ్ నుంచి సుమారు రూ.0.40 కోట్లు, ఆంధ్ర ప్రాంతాల నుంచి కలిపి సుమారు రూ.2.2 కోట్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు రూ.0.40 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు రూ.0.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.6.5 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.
మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్ను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కథలోని ట్విస్టులు, శ్రీ విష్ణు నటన, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీ విష్ణు మరోసారి థ్రిల్లర్ కథతో వచ్చిన 'మృత్యుంజయ్' బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి.
బాక్సాఫీస్ కలెక్షన్స్
తెలుగు యాక్షన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' (Mrithyunjay) బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనతో ముందుకు సాగుతోంది. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రెండు రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి మోస్తరు స్పందన లభించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం మొదటి రోజు ఈ మూవీ దాదాపు రూ.1 కోటి నెట్ కలెక్షన్లు సాధించింది. థియేటర్లలో మొదటి రోజు ఆడియన్స్ స్పందన కూడా ఆశాజనకంగానే కనిపించింది. ముఖ్యంగా యాక్షన్, థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు సమాచారం.
ఇక రెండో రోజు కలెక్షన్లు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. రెండో రోజు ఈ సినిమా దాదాపు రూ.1.25 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రెండు రోజుల కలిపి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.2.25 కోట్లు నెట్ వసూళ్లు నమోదు చేసింది. గ్రాస్ కలెక్షన్ల పరంగా చూస్తే ఇండియాలో మొత్తం రూ.2.6 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇదే మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా నమోదు చేసింది. ప్రస్తుతం విదేశీ మార్కెట్ నుంచి పెద్దగా వసూళ్లు నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక మూడో రోజు కలెక్షన్స్ అంచనాలను చూస్తే.. వీకెండ్ కారణంగా ఆదివారం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాపంగా రెండు రోజుల్లో రూ.5.5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు చేరుకోనే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మృత్యుంజయ్ కు 'సాంప్రదాయిని సుప్పిణి సుద్దపూసాని'కంటే మెరుగైన ఓపెనింగ్ లభించింది. ప్రేక్షకుల నుంచి వచ్చే మౌత్ టాక్ బాగుంది. ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింత మంచి కలెక్షన్స్ సాధించే అవకాశముంది. తర్వలోనే బ్రేక్ ఈవెన్ దాటే అవకాశముందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications


















