ఐదో రోజూ ఆగని సైరా కలెక్షన్ల సునామీ.. ఇప్పటిదాకా ఎంత రాబట్టిందంటే
మెగా మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఏ రోజుకారోజు స్పీడు పెంచేస్తూ ఓ రేంజ్ వసూళ్లు రాబడుతోంది. సైరా సునామీ చూస్తుంటే కొద్ది రోజుల్లోనే సరికొత్త రికార్డులకు తెరలేపేలా కనిపిస్తోంది. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా నిన్నటితో అయిదు రోజులు పూర్తిచేసుకుంది.
Recommended Video

రామ్ చరణ్ శ్రద్ద.. కాసుల పంట
తండ్రికి కానుకగా ఇవ్వాలని రామ్ చరణ్ ఎంతో శ్రద్దగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందించారు. మెగాస్టార్ కెరీర్ లోనే తొలిసారి ఓ చారిత్రాక చిత్ర నిర్మాణం చేపట్టి భేష్ అనిపించుకున్నారు రామ్ చరణ్. పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న సైరా నరసింహా రెడ్డి మరోవైపు కాసుల పంట పండిస్తోంది. చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అవతారంలో చిరంజీవిని చూసి ఫిదా అవుతున్నారు జనం.

ఆదివారం నాడు సైరా జోష్
దసరా సెలవులు రావడం సైరాకు బాగా కలిసొస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా అదే జోష్ కొనసాగిస్తూ సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. ఈ బాటలోనే ఐదో రోజైన ఆదివారం సత్తా చాటింది సైరా నరసింహా రెడ్డి. ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాల థియేటర్లన్నీ మెగా అభిమానులతో కిటకిటలాడాయి. దీంతో మంచి వసూళ్లు రాబట్టింది.

నాలుగో రోజుతో పోల్చితే ఐదో రోజు
నాలుగో రోజుతో పోల్చితే ఐదో రోజు కాస్త పుంజుకుంది సైరా నరసింహా రెడ్డి. ఆదివారం సెలవు దినం కావడంతో నాలుగో రోజును మించి కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఒక్కరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వసూలయ్యాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఐదు రోజులు ముగిసే సరికి 75 కోట్లు
నాలుగో రోజు ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 61.42 కోట్ల షేర్ రాబట్టిన సైరా నరసింహా రెడ్డి.. ఇదో రోజు మరో 10 కోట్లు కలుపుకుంది. అన్ని ఏరియాల్లో కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ చిరంజీవి స్టామినా నిరూపించింది. మొత్తంగా చూస్తే ఐదు రోజులు ముగిసే సరికి 75 కోట్ల షేర్ వాసులు చేసింది సైరా నరసింహా రెడ్డి మూవీ.

ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం.. మెగా ఫ్యాన్స్
ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం సైరాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో మెగా అభిమానుల్లో ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











