200 కోట్ల కలెక్షన్లతో తుడరం సంచలనం.. ఎంపురాన్ రికార్డు బ్రేక్.. మోహన్లాల్ ఎమోషనల్ ట్వీట్
మలయాళ చిత్రం తుడరం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా మోహన్ లాల్ కెరీర్లో రికార్డులు క్రియేట్ చేస్తున్నది. మోహన్ లాల్, హీరోయిన్ శోభన జంటగా నటించిన తాజా చిత్రానికి ఎం రంజిత్ నిర్మాతగా వ్యవహరించగా, తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రకాశ్ వర్మ, బిను పప్పు, భారతీ రాజా, థామస్ మ్యాథ్యూ, సంగీత్ ప్రతాప్, అర్ష చాందిని బైజూ తదితరులు నటించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రాజపుత్ర విజువల్ మీడియా బ్యానర్పై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన రిలీజైంది. ఈ మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తుడరం బడ్జెట్
స్టార్ హీరో, హీరోయిన్లు మోహన్ లాల్, శోభనతోపాటు మలయాళంలో టాలెంటెడ్ యాక్టర్లు నటించడం, ఈ సినిమాను ప్రొడక్షన్ పరంగా రిచ్గా, పాపులర్ టెక్నిషియన్స్ పనిచేయడంతో బడ్జెట్ కూడా భారీగా అయింది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు బడ్జెట్ సుమారుగా 90 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఎంపురాన్ రికార్డు బ్రేక్
తుడరం చిత్రం కేరళలో రికార్డు కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా ఇటీవల రిలీజైన భారీ బడ్జెట్ చిత్రం ఎంపురాన్ సినిమా కంటే అధికంగా వసూళ్లను సాధించడం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు. ఈ సినిమా కేరళ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తూ..గత 17 రోజుల్లో ఈ సినిమా 97 కోట్ల రూపాయలు కలెక్షన్లను నమోదు చేసింది. ఇక 18వ రోజు అంటే మూడో సోమవారం ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరే అవకాశం ఉంది.
దక్షిణాది రాష్ట్రాల్లో
ఇక కేరళ బాక్సాఫీస్ను మినహాయిస్తే.. కర్ణాటకలో ఈ సినిమా 7.5 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 3.17 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇండియాలో ఈ సినిమా సుమారుగా 120 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది.
ఓవర్సీస్ మార్కెట్లో
ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు నార్త్ అమెరికా, సింగపూర్, మలేషియా, గల్ఫ్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో భారీ రెస్పాన్స్ అందుకొన్నది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో 87 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 120 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 87 కోట్లు కలిపి మొత్తంగా 207 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
మోహన్ లాల్ భావోద్వేగం
తుడరం సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్లో చేరడంపై మోహన్ లాల్ ఎమోషనల్ అయ్యారు. తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెడుతూ.. కొన్ని ప్రయాణాలకు పెద్దగా చప్పుడు అవసరం లేదు. కేవలం హృదయాలను మెప్పించి ముందుకు తీసుకెళ్లగలిగితే చాలూ. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాల్లో తుడరం స్థానం సంపాదించుకొన్నది. కేరళలో అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అని మోహన్ లాల్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











