Varanasi Business: ఆంధ్రా, నైజాంలో భారీగా వారణాసి రికార్డు బిజినెస్... ఆ ఒక్క ఏరియాకే కళ్లు చెదిరే ఆఫర్?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం వారణాసి. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న టేకప్ చేస్తోన్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు కెరీర్లో తొలిసారిగా మహేశ్ వంటి సూపర్స్టార్తో రాజమౌళి తీస్తోన్న మూవీ కావడం అంచనాలను మరింత పెంచేస్తోంది. దీనికి తగినట్లుగానే వారణాసి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా సంస్థలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య భారీ పోటీ నెలకొంది. తాజాగా ఓ ఏరియా హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ .. నిర్మాతలకు కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
1300 కోట్ల బడ్జెట్తో వారణాసి
శ్రీ దుర్గా ఆర్ట్స్, షోవింగ్ బిజినెస్ బ్యానర్స్పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తీకేయ, ఎస్ గోపాల్ రెడ్డిలు సంయుక్తంగా వారణాసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా... మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాష్రాజ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. మిగిలిన టెక్నీషియన్స్, ఇతర నటీనటుల వివరాలను రాజమౌళి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా, తమ్మిరాజు ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా 1300 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ మూవీగా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.

రూట్ మార్చిన రాజమౌళి
గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్లో విడుదల చేసిన వారణాసి గ్లింప్స్కు జనం, సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. వారణాసి ఎప్పుడు వస్తుందోనని టాలీవుడ్తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా ప్రకటన నుంచి షూటింగ్ వరకు రాజమౌళి తన పంథాను పూర్తిగా మార్చేశారు. తన సినిమాల్లోని వివరాలను, ఇతర అంశాలను చాలా గుట్టుగా ఉంచుతూ.. ఒక్కొక్కటి రివీల్ చేస్తూ హైప్ పెంచుతారు జక్కన్న అలాంటిది వారణాసి విషయంలో మాత్రం పూర్తిగా మారిపోయారు. గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్లోనే పలు కీలక విషయాలను వెల్లడించారు. వారణాసి రిలీజ్ విషయంలో వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ.. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని జక్కన్న అధికారికంగా ప్రకటించడంతో మహేశ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
వారణాసి థియేట్రికల్ బిజినెస్పై అంచనాలు
ఇదిలాఉండగా.. రాజమౌళి సినిమాలన్నీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్పరంగా కొత్త లెక్కలు సృష్టించాయి. ఇక కలెక్షన్ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో వారణాసి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీతో పాటు ఓవర్సీస్ రైట్స్ కోసం బడా కంపెనీలు ఎంత పెట్టడానికైనా రెడీగా ఉన్నట్లుగా చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కాదు.. వారణాసి మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్, ఆడియో హక్కులు, శాటిలైట్ రైట్స్ కోసం కూడా అదే స్థాయిలో పోటీ నెలకొంది. తాజాగా వారణాసి థియేట్రికల్ రైట్స్కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
ఆ ఏరియా రైట్స్ కోసం క్రేజీ ఆఫర్
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా థియేట్రికల్ రైట్స్ కోసం స్థానిక డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఈ చిత్ర నిర్మాతలకు ఏకంగా 18 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లుగా ఫిలింనగర్లో చర్చ జరుగుతోంది. గతంలో బాహుబలి 2 మూవీ.. ఈస్ట్ గోదావరిలో 18 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి ఆల్టైమ్ రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు వారణాసి అంతకుమించి వసూలు చేసే అవకాశం ఉండటంతో కేవలం ఒక్క తూర్పుగోదావరి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ఈ స్థాయిలో ఆఫర్ ఇచ్చినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి వారణాసి, రాజమౌళిపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అయితే వారణాసి చిత్ర నిర్మాతలు మాత్రం ఇప్పట్లో థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసేందుకు ఆసక్తిగా లేరని ఫిలింనగర్ టాక్. అయితే ఒకవేళ బిజినెస్ జరిగితే మాత్రం వారణాసికి ఒక్క ఆంధ్రా, నైజాంలలోనే ఏకంగా 300 నుంచి 400 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే పరిస్ధితి ఇలా ఉంటే.. టీజర్, ట్రైలర్ లాంటివి విడుదలయ్యాక వారణాసి బిజినెస్ లెక్కలు ఏ రేంజ్లో ఉంటాయోనని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.


Click it and Unblock the Notifications











