నిజమా... 'విశ్వరూపం' అంత కలెక్ట్ చేసిందా?
చెన్నై : వివాదాలతో మొదలైన 'విశ్వరూపం' భాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంతో కమల్ తనకు సాటిలేదని మరోసారి ప్రూవ్ చేసి, రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇటీవలే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఆ మైలురాయిని దాటిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తీవ్రవాదుల నేపథ్యంతో కమల్ ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన 'విశ్వరూపం' తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.
న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో హీరోయిన్ పూజాకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 'విశ్వరూపం' రూ.200 కోట్లు దాటి వసూళ్లు రాబడుతోంది. చిత్ర యూనిట్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నాం. 'విశ్వరూపం- 2' పనులు శరవేగంగా, జాగ్రత్తగా సాగుతున్నాయి. రెండు, మూడు నెలల్లో విడుదలవుతుందని చెప్పారు. ఈ చిత్రం తమిళనాట విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరోవైపు పైరసీ వెంటాడుతున్నా ప్రేక్షకులు థియేటర్వైపే మొగ్గు చూపుతున్నారు.
ఇక ఒక వర్గాన్ని కించపరిచే దృశ్యాలు ఉన్నాయనే ఆరోపణల మధ్య చిత్రం విడుదల నిలిచిపోయింది. చిత్ర ప్రదర్శనతో శాంతి, భద్రతలకు భంగం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి జె.జయలలిత నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం 'విశ్వరూపం'పై నిషేధం విధించింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం నెరపగా, కమల్ హాసన్, చిత్ర ప్రదర్శనకు అభ్యంతరం తెలిపిన వర్గాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. చిత్రంలో ఏడు దృశ్యాలు, కొన్ని సంభాషణల తొలగింపునకు కమల్ అంగీకరించటంతో చిత్ర ప్రదర్శనకు మార్గం సుగమమైంది.
తమిళనాడు ప్రభుత్వం 'విశ్వరూపం'పై నిషేధాన్ని ఎత్తివేయటంతో కమల్ హాసన్ తాను మద్రాస్ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. జస్టిస్ ఎస్.రాజేశ్వరన్ కమల్ పిటిషన్ను విచారిస్తున్నారు. ప్రభుత్వం, కమల్ కూడా తమతమ పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు ఆయన అనుమతించారు. అంతేగాక రాజీపడేందుకు సిద్ధమని ఇరు పక్షాలు (కమల్ వెర్సస్ ముస్లిం గ్రూపులు) కూడా సన్నద్ధత వ్యక్తం చేశాయి. దాంతో నలుగుతున్న వివాదానికి తెరపడింది. తమిళనాడులోని జిల్లా కలెక్టర్లు తాము విధించిన నిషేధపుటుత్తర్వులను ఎత్తివేశారు.


Click it and Unblock the Notifications











