‘సాహో’ ఫైనల్ రిజల్ట్ ఏమిటి? నిర్మాతలు నష్టపోలేదా? మరి డిస్ట్రిబ్యూటర్లు?
'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ అభిమానులు తమ హీరో నుంచి వచ్చే సినిమా కోసం దాదాపు రెండేళ్లు నిరీక్షించారు. ఎట్టకేలకు ప్రభాస్ తర్వాతి సినిమా 'సాహో' ఆగస్టు 30న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం అభిమానులను మెప్పించినప్పటికీ.. సినీ విమర్శకులను అంతగా మెప్పించలేక పోయింది. ఫలితంగా ప్రజల్లోకి మిక్డ్స్ టాక్ వెళ్లడంతో రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేక పోయింది. సినిమా విడుదలైన దాదాపు 3 వీకెండ్స్ (17 రోజులు) పూర్తి అయింది. ఇక బిజినెస్ ముందుకు సాగే పరిస్థితి పెద్దగా లేదు. ఫైనల్ రిజల్ట్ ఏమిటి? ఎంత వసూలు చేసింది, బయట ప్రచారం జరుగుతున్నట్లు నిర్మాతలు భారీగా నష్టపోయారా? లాంటి విషయాలపై ఓ లుక్కేద్దాం.

‘సాహో’ ఎంత వసూలు చేసింది
‘సాహో' సినీ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ వారు ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 వారాల్లో రూ. 424 కోట్లకు పైగా వసూలు చేసింది. 3వ వారాంతం వసూళ్లు కూడా కలుపుకుంటే టోటల్ వసూళ్లు రూ. 450 కోట్లకు రీచ్ అయినట్లు అంచనా. రూ. 500 కోట్ల మార్కును అందుకుంటుందా? అనేది సందేహమే.
Recommended Video

నిర్మాతలకు పెద్దగా నష్టం లేదంటున్న విశ్లేషకులు
‘సాహో' చిత్రాన్ని దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్లో నిర్మించారు. అయితే సినిమాకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం వచ్చిన నేపథ్యంలో నిర్మాతలకు పెద్దగా నష్టం రాలేదని తెలుస్తోంది. ఈ సినిమా లాభాలు తెచ్చిన సినిమా అయితే కాదు, అదే సమయంలో కొంపలు ముంచే నష్టాలు కూడా తేలేదని అంటున్నారు.

డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి లేదు, ఎందుకంటే...
సాధారణంగా ఏదైనా సినిమా లాస్ అయినపుడు డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెట్టడం, తమకు ఆదుకోవాలని ఆందోళన చేయడం జరుగుతుంది. సాహో విషయంలో అలాంటిదేమీ లేదు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రూ. 120 కోట్ల వ్యాల్యూకి అమ్మగా రూ. 80 కోట్లకుపైగా షేర్ రాబట్టింది. ఈ చిత్రాన్ని కొన్ని చోట్ల సొంతగా రిలీజ్ చేశారు. చాలా ఏరియాల్లో అడ్వాన్స్ బేసిస్లో అమ్మడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా పోయింది.

హిందీ వెర్షన్ హిట్
‘సాహో' హిందీ వెర్షన్ హిట్ అని తేలిపోయింది. ఇక్కడ ఈ చిత్రం దాదాపు రూ. 150 కోట్ల రాబట్టింది. నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఇంత భారీ మొత్తం వసూలు చేయడం మామూలు విషయం కాదు. బాలీవుడ్ మార్కెట్లో ప్రభాస్ పాతుకుపోయాడు అనడానికి ఇది నిదర్శనం.

ఓవర్సీస్ మార్కెట్లో...
ఓవర్సీస్ మార్కెట్ రైట్స్ ఓ అంతర్జాతీయ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసి... యూఎస్ఏ, ఇతర ప్రాంతాల్లో రైట్స్ విడివిడిగా విక్రయించింది. అయితే ఇందులో యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే నష్టపోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా, ఇతర ప్రాంతాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు ప్రతికూలంగా రివ్యూలు వచ్చినా కేవలం ప్రభాస్ మీద క్రేజ్ వల్లే మంచి వసూళ్లు రాబట్టింది.

డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా
నిర్మాతలు సాహో డిజిటల్, శాటిల్ లైట్, ఆడియో రైట్స్ ద్వారా మంచి ఆదాయం పొందారు. ఇలా వచ్చిన ఆదాయం కూడా నిర్మాతలు పెద్దగా నష్టపోకుండా ఉండటానికి కారణమని అంటున్నారు. మొత్తంగా చూస్తే ‘సాహో' అనుకున్న అంచనాలను అందుకోలేకపోయినా.... భారీ నష్టాలు తెచ్చిన సినిమా అయితే కాదు.


Click it and Unblock the Notifications











