ఆ క్లబ్లో ప్రభాస్, పవన్, చిరు... మహేశ్కు అందని ద్రాక్షలా... వారణాసితో ఆ రికార్డ్పై కన్ను
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు సూపర్స్టార్ ఇమేజ్తో దూసుకెళ్తున్నారు. ప్రతి సినిమాకు వైవిధ్యం చూపుతూ మాస్, కమర్షియల్, ఎక్స్పెరిమెంట్ ఇలా ఏదైనా సరే అదరగొట్టగలనని నిరూపించుకున్నారు మహేశ్ బాబు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కతున్న వారణాసితో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు మహేశ్. అయితే ఆయనకు ఓ రికార్డ్ మాత్రం అందని ద్రాక్షలా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
అవలీలగా 1000 కోట్లు దాటేస్తోన్న తెలుగు సినిమాలు
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కు మారింది. 1000 కోట్ల రూపాయలు, 1500 కోట్ల రూపాయల మార్క్ను అవలీలగా దాటేస్తున్నాయి. తొలి రోజే ఏకంగా 100 నుంచి 200 కోట్ల రూపాయల ఓపెనింగ్స్తో బాక్సాఫీస్ను షేక్ చేసే స్థాయికి టాలీవుడ్ చేరుకుంది. పుష్ప 2తో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన హీరోగా అల్లు అర్జున్ అరుదైన రికార్డ్ను సొంతం చేసుకున్నారు. ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచేలా టాలీవుడ్ దూసుకెళ్తోంది. భారతదేశంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్ తీస్తే టాప్ 5లో మూడు తెలుగు సినిమాలే ఉన్నాయి. బాహుబలి 2, పుష్ప 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు టాలీవుడ్ సత్తాను చాటి చెప్పాయి.

ఒకప్పుడు 100 కోట్లు కూడా కష్టమే
అయితే గతంలో ఇలాంటి పరిస్ధితులు ఉండేవి కావు. తెలుగు సినిమాలు 100 కోట్ల గ్రాస్ కొట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఇలాంటి పరిస్ధితిని మార్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ఘనత ఖచ్చితంగా రాజమౌళి, బాహుబలి సినిమాదే. 100 కోట్ల రూపాయల కలెక్షన్సే కాదు.. 100 కోట్ల రూపాయల షేర్ను దాటి 150 కోట్ల రూపాయల షేర్ను కూడా ఈజీగా దాటేస్తున్నారు మన హీరోలు. అయితే మహేశ్ బాబుకు మాత్రం 300 కోట్ల రూపాయల కలెక్షన్స్... 150 కోట్ల రూపాయల షేర్ అందుకునే అవకాశం పలుమార్లు మిస్ అయ్యింది.
ప్రభాస్ రేర్ రికార్డ్
తెలుగు హీరోలలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరిట అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ ఉంది. ఆయన ఏకంగా రెండు సార్లు 1000 కోట్ల మార్క్ దాటాడు. అలాగే కెరీర్లో ఏడు సార్లు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఏకైక టాలీవుడ్ హీరోగా నిలిచారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరిట ఒక 1000 కోట్ల మూవీ, ఒక 300 కోట్ల సినిమా ఉంది. రామ్ చరణ్కు ఒక 1000 కోట్ల రూపాయల మూవీ, ఒక 200 కోట్ల రూపాయల మూవీ ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్కు ఒక 1000 కోట్ల మూవీ... ఒక 500 కోట్ల రూపాయల మూవీ ఉంది.
300 కోట్లు దాటేస్తోన్న సీనియర్లు
సీనియర్ హీరోల విషయానికి వస్తే అగ్రనటుల్లో విక్టరీ వెంకటేష్ తొలిసారిగా 300 కోట్ల రూపాయల క్లబ్లో చేరారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 300 కోట్ల మార్క్ చేరుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీతో 300 కోట్ల వసూళ్లను, 150 కోట్ల రూపాయల షేర్ మార్క్ను దాటారు. అయితే పోకిరి, శ్రీమంతుడు వంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టి.. నాన్ బాహుబలి మూవీస్లోనూ చరిత్ర సృష్టించిన సూపర్స్టార్ మహేశ్ బాబుకు ఇప్పటి వరకు 300 కోట్ల మార్క్ మూవీ లేదు. ఆయన కెరీర్లో సరిలేరు నీకెవ్వరు మూవీ 260 కోట్ల కలెక్షన్స్తో టాప్లో నిలిచింది. ఆ తర్వాత సర్కారు వారి పాట 190 కోట్ల రూపాయలు, గుంటూరు కారం 185 కోట్ల రూపాయలతో నిలిచాయి.
వారణాసిపై మహేశ్ ఆశలు
ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయల మార్క్ కలెక్షన్స్ కానీ.. 150 కోట్ల రూపాయల షేర్ కానీ మహేశ్ బాబు అందుకోలేకపోయారు. ఇది ఆయన అభిమానులను తీవ్రంగా వేధిస్తోంది. సీనియర్ హీరోలు కూడా 300 కోట్ల మార్క్ చేరుకుంటున్న నేపథ్యంలో మహేశ్ ఇప్పటికీ ఆ ఫీట్ను టచ్ చేయలేకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వారణాసి చిత్రం మహేశ్ కలను తీర్చనుందని వారు ఆశిస్తున్నారు. ఈ సినిమాకు ఏకంగా 5000 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారంటే ... వారణాసిపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. తద్వారా భారత్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన హీరోగా మహేశ్ బాబు నిలుస్తారని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











