కాశీనాథుని విశ్వనాథ్
Born on 19 Feb 1930 (Age 93)
కాశీనాథుని విశ్వనాథ్ బయోగ్రఫీ
కళాతపస్విగా సినీ అభిమానులు చేత పిలువబడుతున్న పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా గొప్ప దర్శకుడు మరియు రచయిత అంతేకాదు సంగీతం గురించి అతనినికి తెలిసినంత మరెవరికి తెలియదు అన్నట్లుగా విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది.ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి కె.విశ్వనాథ్.
గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దపులివర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్ ఫిలింనగర్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయనకు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన శంకరాభరణం సినిమా విడుదల రోజైన ఫిబ్రవరి 2వ తేదీనే కె.విశ్వనాథ్ కన్నుమూయడం విశేషం. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన విశ్వనాథ్.. 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.
కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం, తల్లి సరస్వతమ్మ. బాల్యం నుంచీ చదువుల్లో చురుగ్గా ఉన్న విశ్వనాథ్, అప్పట్లోనే రామాయణ, భారత, భాగవతాలు చదివేశారు. ఏ పుస్తకం కనిపించినా, చదువుతూ పోయేవారు. గుంటూరు హిందూ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివిన విశ్వనాథ్, అదే ఊరిలోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో బి.యస్సీ. పట్టా పుచ్చుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం విజయా-వాహినీ సంస్థలో పనిచేసేవారు. దాంతో డిగ్రీ పూర్తి కాగానే విజయావాహినీ స్టూడియోస్ లో సౌండ్ రికార్డిస్ట్ గా చేరారు.
విజయా సంస్థ నిర్మించిన ‘పాతాళభైరవి’కి అసిస్టెంట్ రికార్డిస్ట్ గా చేశారు విశ్వనాథ్. విశ్వనాథ్ కు తొలి నుంచీ కళారాధన అధికం. సకల కళలకూ నెలవైన విశ్వనాథుని పేరు పెట్టుకున్న ఆయన మనసు చిత్రసీమవైపు మరలడంలో ఆశ్చర్యమేముంది?… సౌండ్ ఇంజనీర్ గా చేశాక, ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్ గా చేరారు. కొన్ని చిత్రాలకు కథారచనలో పాలు పంచుకున్నారు. అలా అలా అన్నపూర్ణ సంస్థలో రాణిస్తున్న రోజుల్లోనే ఆ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావును విశ్వనాథ్ పనితనం ఆకర్షించింది. ‘ఆత్మగౌరవం’ చిత్రంతో కె.విశ్వనాథ్ ను దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి. తొలి చిత్రంలోనే తనదైన బాణీ ప్రదర్శించారు విశ్వనాథ్.
నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్ తో చిత్రాలు రూపొందించారు విశ్వనాథ్. అప్పటి వర్ధమాన కథానాయకులు కృష్ణ, శోభన్ బాబుతోనూ మురిపించే సినిమాలు అందించారు. తన చిత్రాలలో ఏదో వైవిధ్యం ప్రదర్శించాలని తొలి నుంచీ ఆయన తపించేవారు. అందుకు తగ్గట్టుగానే కథలను ఎంచుకొనేవారు. తెలుగునాట శోభన్ బాబు, చంద్రమోహన్, కమల్ హాసన్ వంటివారు ఎదగడానికి విశ్వనాధ్ మూవీస్ ఒక రకంగా కారణం అయ్యాయి
విశ్వనాథ్ పేరు వినగానే ముందుగా ఆయన చిత్రాలలో పెద్ద పీట వేసుకున్న సంగీతసాహిత్యాలు గుర్తుకు వస్తాయి. తరువాత కథల్లోనే లీనమై ఆకర్షించే కళలూ స్ఫురిస్తాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు కళాఖండాలు నవతరం ప్రేక్షకులను సైతం మురిపిస్తూనే ఉన్నాయి. కె.విశ్వనాథ్ చిత్రాలను చూసి ఆ రోజుల్లో ఎందరో లలిత కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తరువాతి రోజుల్లో కళాకారులుగానూ రాణించారు. అంతలా తెలుగువారిని కళలవైపు మళ్ళించిన దర్శకులు మరొకరు కానరారు
కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ వృద్దాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతూ 2023 ఫిబ్రవరి 2వ తేదీ 9 గంటల ప్రాంతంలో శ్వాస సంబంధిత సమస్యతో బాధపడటంతో అపోలో హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్టు అపోలో వైద్యులు ధృవీకరించారు. ఆయన ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి 9.45 నిమిషాలకు కన్నుమూశారు
సంబంధిత వార్తలు