'అత్తారింటికి దారేది', 'మిర్చి' కలిపి వండిన కథంట
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రం ప్రేరణతో ఇప్పుడు తెలుగులో మరో సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. అది మరేదోకాదు... రామ్ హీరోగా రూపొందుతున్న 'పండగ చేస్కో' . అందులో రామ్ ...ఎన్నారై గా కనిపిస్తాడని, అతను తన కుటుంబ సమస్య పరిష్కరించటానికి ఇండియా వస్తాడని తెలుస్తోంది. ఫస్టాఫ్ అత్తారింటికి దారేది,సెకండాఫ్ ...మిర్చిని గుర్తుకు తెస్తూ సాగుతుందని వినిపిస్తోంది. అయితే ఇది రూమరా లేక నిజమా అని తేలాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ హీరో. రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత.
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ... డాలర్లలో మునిగి తేలిన కుర్రాడతను. కోరుకొంటే విలాసవంతమైన జీవితం అతని కాళ్ల ముందు ఉంటుంది. కానీ అదేం వద్దనుకొన్నాడు. తన వాళ్ల కోసం స్వదేశానికి వచ్చేశాడు. ఇక్కడికొచ్చి ఏం చేశాడో తెలియాలంటే మా చిత్రం చూడాలి అంటున్నారు . ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'.

అలాగే ''రామ్ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. హీరో,హీరోయిన్స్, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు. రామ్ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా చిత్రబృందం ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''తనవారి శ్రేయస్సు కోసం పాటుపడే కుర్రాడి కథ ఇది. ప్రతి సన్నివేశం ఓ పండగలా ఉంటుంది. రామ్ నటన, డ్యాన్స్, పోరాటాలూ.. తప్పకుండా ఆకట్టుకొంటాయి. సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్తో సినిమా చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు.
సోమవారం నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ మొదలుకానుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. చిత్రంలో సాయికుమార్, రావు రమేష్, జయప్రకాశ్రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎ.విల్సన్, సంగీతం: తమన్, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్.ప్రకాశ్


Click it and Unblock the Notifications











