వారణాసి తర్వాత మహేష్ నెక్స్ట్ మూవీ ఎవరితో.. ?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నసినిమా 'వారణాసి'. ఈ భారీ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ పాన్ వరల్డ్ మూవీపై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. అయితే.. ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎవరితో అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ లక్కీ డైరెక్టర్ ఎవరు?
రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా టైమ్ ట్రావెల్, మైథాలజీ, అడ్వెంచర్ అంశాల మేళవింపుగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు రెండు లేదా మూడు డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాముడి తరహా లుక్లో ఆయన కనిపించనున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 'మందాకినీ' పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ'అనే పవర్ పుల్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారనే ప్రచారం సినిమాపై మరింత హైప్ను తీసుకొచ్చింది.

ఈ భారీ బడ్జెట్ మూవీని ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో 'వారణాసి' తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తారు? అనే చర్చ టాలీవుడ్లో మొదలైంది. సాధారణంగా రాజమౌళి సినిమాల తర్వాత హీరోల కెరీర్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. బాహుబలి తర్వాత ప్రభాస్, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
అదే విధంగా 'వారణాసి' తర్వాత మహేష్ బాబు కూడా గ్లోబల్ స్టార్గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆయన తదుపరి సినిమా ఎంపికపై ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక దృష్టి పడింది. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముందువరుసలో ఉన్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి కల్ట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు సందీప్ వంగా.
సందీప్ పేరు ముందువరుసలో ఉండటానికి మరో కారణం కూడా ఉంది. గతంలోనే మహేష్ బాబుతో సినిమా చేయాలని సందీప్ తన కోరికను వ్యక్తం చేశారు. పలు ఇంటర్వ్యూల్లో మహేశ్ బాబు గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మహేష్ కు సరిపోయే పవర్ఫుల్ కథ తన వద్ద ఉందని అప్పట్లో సంకేతాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం సందీప్ వంగా చేతిలో స్పిరిట్, యానిమల్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో మహేష్-సందీప్ కాంబినేషన్ వెంటనే పట్టాలెక్కే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు 'పెద్ది'తో విజయం అందుకున్న బుచ్చిబాబు సానా పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, భారీ విజువల్స్తో సినిమాలు తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు, మహేష్ కోసం ఓ ప్రత్యేక కథ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం చాలాకాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా పౌరాణిక, ఫాంటసీ అంశాలతో కూడిన కథను మహేష్కు వినిపించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఈ వార్తలపై స్పందించిన బుచ్చిబాబు, "కాలమే నిర్ణయిస్తుంది" అని వ్యాఖ్యానించడం మరింత ఆసక్తిని పెంచింది. దీంతో మహేష్ తదుపరి డైరెక్టర్ బుచ్చిబాబే అనే ప్రచారం జరుగుతుంది.
ఇక మరో ఎవరూ ఊహించని విధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు తెరపైకి వచ్చింది. 'సరిలేరు నీకెవ్వరు'తో మహేష్కు బ్లాక్బస్టర్ హిట్ అందించిన అనిల్, మరోసారి సూపర్ స్టార్తో పని చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ కథను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. భారీ ప్రాజెక్ట్ తర్వాత కాస్త రిలాక్సింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటే మహేష్ ఈ ఆప్షన్ను కూడా పరిశీలించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే 'వారణాసి' తర్వాత మహేష్ బాబు మార్కెట్ పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం ఆయన తెలుగు స్టార్ మాత్రమే. కానీ రాజమౌళి సినిమా తర్వాత ఆయన గ్లోబల్ ఆడియన్స్కు చేరువయ్యే అవకాశం ఉంది. అందుకే తదుపరి సినిమా కేవలం తెలుగు మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని కాకుండా, అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉండాలని మహేష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ను ఎవరితో చేస్తారు? ఎలాంటి కథను ఎంచుకుంటారు? అనేది మాత్రం 'వారణాసి' షూటింగ్ పూర్తయ్యే వరకు సస్పెన్స్ ఇలాగే కొనసాగే అవకాశముంది.


Click it and Unblock the Notifications






