అకీరా నందన్ డెబ్యూ మూవీకి డైరెక్టర్గా పాన్ ఇండియా హీరో... మెగా ఫ్యామిలీ భారీ స్కెచ్?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణులంతా తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. వీరిలో కొందరు స్టార్లుగా నిలదొక్కుకోగా.. మరికొందరు ఇదే దారిలో ఉన్నారు. త్వరలోనే మరికొందరు స్టార్ కిడ్స్ ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ను శాసిస్తోన్న మెగా ఫ్యామిలీ నుంచే తీసుకుంటే చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్లు తమ వారసులుగా రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్లను వెండితెరకు పరిచయం చేశారు. వీరే కాకుండా ఈ కుటుంబం నుంచి నిహారిక, సాయిథరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
అకీరా ఎంట్రీ ఎప్పుడు?
కానీ పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తన వారసుడు అకీరా నందన్ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అకీరా డెబ్యూ మూవీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అకీరా విషయంలో తొలి నుంచి పక్కా ప్లానింగ్తో వెళ్తున్నారు అతని తల్లి రేణు దేశాయ్. యాక్టింగ్, డ్యాన్స్, సంగీతం ఇలా అన్ని రకాలుగా కొడుకుని సిద్ధం చేసింది. ఇక పియానో వాయించడంలో అకీరా స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయడం గురించి రోజూ భగవంతుడికి కొబ్బరికాయ కొడుతున్నట్లు రేణు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

పవన్ వెంటే అకీరా నందన్
గత కొన్నాళ్లుగా తండ్రి పవన్ కళ్యాణ్ వెంటే ఉంటున్నారు అకీరా నందన్. ఇక పవన్ నటించిన హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల స్పెషల్ స్క్రీనింగ్కు హాజరైన అకీరాను చూసి పవన్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీలోనూ అకీరా ఉన్నట్లు గట్టిగా పుకార్లు వచ్చాయి. ఈ చిత్రంలోని ఓ సాంగ్లో చిన్న యానిమేషన్లో కనిపించిన యువకుడి రూపం అకీరాను పోలి ఉండటమే ఈ ఊహాగానాలకు కారణం. మెగా అభిమానులను సర్ప్రైజ్ చేయడానికి అకీరాతో సుజీత్ ఇలా ప్లాన్ చేశాడని రూమర్స్ వైరల్ అయ్యాయి. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక ఇదంతా ఫేక్ అని తేలిపోయింది.
శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ఎంట్రీ?
అయితే అకీరా నందన్ ఎంట్రీపై ఊహాగానాలకు మాత్రం చెక్ పడటం లేదు. కొద్దిరోజుల క్రితం ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా అకీరా ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతోంది. అకీరా డెబ్యూ బాధ్యతలను ఓ పాన్ ఇండియా హీరో తీసుకున్నాడని ఫిలిం సర్కిల్స్లో జోరుగా ప్రచారం ఊపందుకుంది. డైరెక్టర్కు కాకుండా హీరో చేతుల్లో అకీరా ఎంట్రీని పెట్టడం ఏంటా? అనే అనుమానం ప్రతి ఒక్కరికీ వస్తోంది. సదరు పాన్ ఇండియా స్టార్ ఎవరో కాదు.. అడివి శేష్.
తెరపైకి పాన్ ఇండియా హీరో
మేజర్, గూఢచారి సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటుతున్నారు శేష్. హీరోగానే కాకుండా రైటర్గా, డైరెక్టర్గా, డైలాగ్ రైటర్గా అడివి శేష్ అలరించారు. సినిమాకు సంబంధించిన అన్ని రకాల అంశాలపై పట్టు ఉండటం అడివి శేష్కు అదనపు బలం. అందుకే అకీరా బాధ్యతలను పవన్ కళ్యాణ్ ఆయనకు అప్పగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్తో పాటు అకీరా నందన్తో అడివి శేష్కు వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉండటం కూడా ఈ వార్తలకు బలాన్నిస్తోంది. పవన్ నటించిన పంజాలో అడివి శేష్ నటించారు. అలాగే రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్కు అకీరా మ్యూజిక్ చేయగా శేష్ అండగా నిలిచారు.
అకీరా కోసం వెరైటీ కథ
రోటీన్ కమర్షియల్ ఫార్ములా చిత్రాలు కాకుండా విభిన్నంగా చేయడం అడివి శేష్ స్టైల్. అందుకే అకీరా ఎంట్రీకి శేష్ అయితేనే కరెక్ట్ అని మెగా ఫ్యామిలీ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అకీరా కోసం ఆయన వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే దర్శకత్వం కాకుండా అకీరా మూవీకి అడివి శేష్ కథ అందించే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అకీరా - అడివి శేష్ కాంబోపై త్వరలోనే క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











