అల్లు అరవింద్ అండతోనే 'అత్తారింటికి దారేది'
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ ..మెగా క్యాంప్ కు దూరమయ్యాడంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు రూమర్స్ అనే సంఘటనలు జరుగుతున్నాయి. ఆయన తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' సిడీ లీక్ కావటంతో వెంటనే రంగంలోకి దిగి పరిస్ధితి చక్కబెట్టింది అల్లు అరవింద్ అని తెలుస్తోంది. అల్లు అరవింద్ ముందుండి 'అత్తారింటికి దారేది' నిర్మాత చేత పోలీసులకు కంప్లైంట్ చేయించటం,లీకేజ్ తో అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వమని గొడవ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కు సర్ది చెప్పడం, కొన్ని ఏరియాల్లో తమ సంస్ధ ద్వారా రిలీజ్ చెయ్యటానికి ఏర్పాట్లు చేయటం వంటివి చేసారుట.
అలాగే రిలీజ్ డేట్ వెంటనే ప్రకటించటం వెనక కూడా అల్లు అరవింద్ ఆలోచన ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇలా తమలో తమకు ఎన్ని ఉన్నా అవన్నీ ప్రక్కన పెట్టి కష్టం రాగానే పిలవకుండానే వెంటనే రంగంలోకి దిగి తామంటా ఒకటే అనిపించేలా చర్యలు తీసుకోవటం అల్లు అరవింద్ కే చెల్లిందంటున్నారు. ఆ మధ్యన ప్రజారాజ్య పార్టీ పెట్టాక అల్లు అరవింద్ కు, పవన్ కి మధ్య మనస్పర్దలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అవన్నీ ఈ చర్యలతో కొట్టుకుపోయాయి. అటు తన బావ చిరంజీవి ఆనందం కలిగేలా ఆయన ఇలా పరిస్ధితిని తన చాతుర్యం,అనుభవంతో చక్కదిద్దారు.
ఇక 'అత్తారింటికి దారేది' సినిమా పైరసీకి పాల్పడిన వారిపై ఐటీ యాక్ట్ (2008) 63 బి, 66, ఐపీసీ 420 సెక్షన్ల కింద మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ ప్రభాకరరావు తెలిపారు. సినిమా ఎడిటింగ్ ల్యాబ్ నుంచి సీడీని డౌన్లోడ్ చేసిన ప్రధాన నిందితుడు.. చీకటి అరుణ్కుమార్ (హైదరాబాద్, ఫిలింనగర్), ఏపీఎస్పీ కానిస్టేబుల్ కట్టా రవి (యూసుఫ్గూడ), సుధీర్కుమార్ (పెడన), పోరంకి సురేష్ (పెడన), కొల్లిపర అనిల్కుమార్ (పెడన)లను అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. వీరిని గురువారం స్థానిక కోర్టులో హాజరుపర్చి తర్వాత హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టుకు తరలిస్తామన్నారు.
24 గంటల్లో పైరసీ మిస్టరీని ఛేదించామని, బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, సీఐలు మూర్తి, పల్లపురాజు సహకరించారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, టెక్నికల్ టీమ్తో పాటు ఇతర దర్యాప్తు బృందాలు ఆ పనిలో ఉన్నాయని తెలిపారు. ఇంటి దొంగ అరుణ్కుమారే ఈ పైరసీకి కారణమని స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
అయితే కేవలం స్నేహితుల కోసమే తాను 'అత్తారింటికి దారేది' సినిమా సీడీని బయటకు ఇచ్చానని చిత్ర ఎడిటింగ్ ల్యాబ్ అసిస్టెంట్ చీకటి అరుణ్కుమార్ తెలిపారు. అయితే, సినిమా చూడాల్సిందిగా తన స్నేహితుడైన ఏపీఎస్పీ కానిస్టేబుల్ ప్రసన్నకు సీడీ ఇచ్చాను తప్పితే.. అంతకు మించి తనకెలాంటి దురుద్దేశం లేదన్నారు. స్నేహితుల ద్వారా సీడీ బయటకు వెళ్లి ఇంత రాద్ధాంతం జరుగుతుందనుకోలేదన్నారు. "జరిగిన వాస్తవం ఇంతే, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండ''ంటూ మీడియాతో ఆగ్రహంగా అన్నారు. హైదరాబాద్ నుంచి పెడనకు డీవీడీలు పంపిన కానిస్టేబుల్ రవి కూడా.. తానూ తన స్నేహితుల కోసమే ఈ పని చేసినట్టు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












