మహేశ్ బాబుతో అల్లు అరవింద్ అదిరిపోయే ప్లాన్.. సరైనోడు వచ్చిన వెంటనే షురూ.!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే బడా ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ ద్వారా ఈయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. కెరీర్ తొలినాళ్లలో కేవలం మెగా కాంపౌండ్లోని హీరోలతో మాత్రమే ఈయన సినిమాలు తీసేవారు. కానీ, ప్రస్తుతం ఆయన టాలీవుడ్లోని ఎంతో మంది హీరోలతో సినిమాలు చేస్తున్నారు. సీనియర్ హీరోనా, యంగ్ హీరోనా అనేవి పట్టించుకోకుండా ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేస్తున్నారు. అదే ఆయనను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ను చేసింది. తాజాగా ఈయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా ప్లాన్..? ఎందుకిలా చేస్తున్నారు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఇక్కడ మాత్రమే కాదు.. అక్కడ కూడా
అల్లు అరవింద్ కేవలం తెలుగు సినిమాలకే పరిమితం అయిపోలేదు. ఆయన హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ పలు చిత్రాలను నిర్మించారు. తాజాగా తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జెర్సీ' సినిమా హిందీ రీమేక్ను నిర్మిస్తున్నారు. ఇక్కడ నాని నటించిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కొడుకు కోసం ప్రతిష్టాత్మకంగా
ప్రస్తుతం అల్లు అరవింద్.. రాధాకృష్ణతో కలిసి ‘అల.. వైకుంఠపురములో..' అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తోంది. అలాగే పలువురు ముఖ్య నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.

సరికొత్త అడుగులు వేస్తున్న ప్రొడ్యూసర్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సరికొత్త అడుగులు వేస్తున్నారు. ఆయన త్వరలోనే ఓవర్ ద టాప్ (ఓటీటీ) ఫ్లాట్ఫామ్ను లాంచ్ చేయబోతున్నారట. దీని కోసం ఓ బడా సంస్థతో ఆయన భాగస్వామ్యం అవబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, దీని కోసం అప్పుడే ఓ సినిమాను కూడా కొనేశారని అంటున్నారు.

మహేశ్ బాబుతో అదిరిపోయే ప్లాన్
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో అల్లు అరవింద్ అదిరిపోయే ప్లాన్ చేశారని ఇండస్ట్రీలో ప్రచారం మొదలైంది. గతంలో అల్లు అరవింద్తో సినిమా చేయడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిలో భాగంగానే ఇప్పుడు సూపర్ స్టార్ కోసం దర్శకులను వెతుకుతున్నాడట అరవింద్. సరైన దర్శకుడు దొరికిన వెంటనే ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారని సమాచారం.

ఆయన చెబితే నచ్చలేదు
‘గీత గోవిందం' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన పరశురాం.. అల్లు అరవింద్ సూచన మేరకు గతంలో మహేశ్ బాబుకు ఓ కథను వినిపించాడు. దీనిని కొద్ది రోజులు హోల్డ్ చేసిన మహేశ్.. చివరకు చేయనని చెప్పేశాడని ప్రచారం జరిగింది. ఈ కారణంగానే పరశురాం.. అక్కినేని నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











