ఎన్టీఆర్, రవితేజ,మహేష్...అంతా హ్యాండిచ్చాకే?
హైదరాబాద్: ఓ హీరో కాదన్న పాత్రను మరో హీరో చేయటం సినీ పరిశ్రమలో జరగుతూండటం కామనే. డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకో, స్టార్ డమ్ అడ్డొచ్చో, కథ నచ్చకో, తమ పాత్ర నచ్చకో చాలా సార్లు హీరో వాటిని సున్నితంగా రిజెక్టు చేస్తూంటారు. వాటిని మరో హీరో మహదానందంగా భుజాన ఎత్తుకుంటూంటాడు. అయితే వరసగా ముగ్గురు హీరోలు సీన్ లోకి వచ్చి ...అంతే వేగంగా వెనక్కి వెళ్లటం మాత్రం ఆలోచించదగ్గ విషయమే. తాజాగా అటువంటి సంఘటన ఒకటి జరిగింది.
మహేష్ బాబు రిజెక్టు చేసిన గెస్ట్ రోల్ కి ఎన్టీఆర్ ఆ తర్వాత రవితేజ...ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి చేరారు. ఆ పాత్ర మరేదో కాదు గోన గన్నారెడ్డి అని తెలుస్తోంది. ఆ పాత్రను గతంలో ఎన్టీఆర్ హీరోగా ప్లాన్ చేసారు. కానీ వర్కవుట్ కాలేదు. అయితే ఆ పాత్ర మీద మమకారంతో ఎన్టీఆర్ ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో కానీ తర్వాత రవితేజ చేస్తాడు అన్నారు. అదీ తూచ్ అన్నారు. మొదట మహేష్ కాదన్న తర్వాత ఇంతమంది మారారు. అయితే ఫైనల్ గా అఫీషియల్ గా అల్లు అర్జున్ చేస్తున్నాడని వార్త వచ్చింది కాబట్టి ఈ సారి మారే అవకాసం లేదు.

మొదటి నుంచీ అల్లు అర్జున్.. ఉత్సాహానికి మారు పేరు. చేసే ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రేమికుడిగా, బాధ్యతలు నెత్తికెత్తుకున్న యువకుడిగా, దేశముదురుగా.. ఇలా వివిధ పాత్రలతో అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతడు చారిత్రక నేపథ్యమున్న పాత్రలో కనిపించబోతున్నాడు. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని గుణశేఖర్ హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో ప్రకటించారు.
''కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న కథానాయకుడతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం కథానాయకులలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.
ఎన్టీఆర్కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది. ఇప్పటికే బన్నీ గుర్రపుస్వారీ, కత్తిసాములో శిక్షణ పొందుతున్నాడు. అతడి సరసన అనామిక దేవిగా కేథరిన్ నటిస్తుంది. వీరిపై జులైలో చిత్రీకరణ జరుపుతాం'' అంటూ వివరించారు గుణశేఖర్. ఈ సినిమాలో అనుష్క, రానా, నిత్యమీనన్, కృష్ణంరాజు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'


Click it and Unblock the Notifications











