రాఘవేంద్రరావు కుమారుడుతో బాలకృష్ణ ఆ రీమేక్
అనగనగా ఒక ధీరుడు చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన సూర్య ప్రకాశ్ ఆ చిత్రం ఘోర పరాజయంతో మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణను డైరక్ట్ చేసే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. తన తొలి సినిమా ఫెయిల్యూర్ అయినా గ్రాఫిక్స్ లోనూ,హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాల్లోనూ ప్రకాష్ తన ప్రతిభను చూపించాడని,జానపద కథను బాగా తీసాడని అప్పట్లో వినిపించింది. దాంతో జానపద చిత్రం తరహా రీమేక్ కి ఈ యువ దర్శకుడుని అడిగినట్లు చెప్తున్నారు. ఆ చిత్రం మరేదో కాదు భట్టి విక్రమార్క.
ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ చిత్రంగా నిలిచిన చిత్రం భట్టి విక్రమార్క. జానపద కథను వెండి తెర కావ్యంగా మలిచి అప్పట్లో హిట్ కొట్టారు. ఈ జనరేషన్ పిల్లలకు సైతం ఆ పాత్ర,ఆ కథను పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో యలమంచిలి సాయిబాబు ఈ నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. రాఘవేంద్రరావు గారి కుమారుడు ప్రకాష్ తో చేసే అవకాశం ఉందని వార్తలు సైతం వినపడుతున్నాయి.
బాలకృష్ణ తన తండ్రి నటించిన లవకుశ చిత్రాన్ని శ్రీరామరాజ్యం టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. బాపు దర్శకత్వంలో చేసిన ఈ చిత్రం ఆర్దికంగా పెద్ద గిట్టుబాటు కాకపోయినా మంచి పేరు ని తెచ్చిపెట్టింది. దాంతో అదే ఉత్సాహంతో అదే నిర్మాతతో బాలకృష్ణ మరో చిత్రం చేయటానికి కమిటయ్యారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించి స్క్రిప్టు వర్క్ జరుగుతోందని చెప్తున్నారు. రాఘవేంద్రరావు తన షిర్డీ సాయిబాబా చిత్రం విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
బాలకృష్ణ తన తాజా చిత్రం అధినాయకుడు డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా సంతృప్తిగా ఉండటంతో హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం రవిచావలి దర్సకత్వంలో శ్రీమన్నారాయణ చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం విభిన్నంగా ఉంటుందని చెప్తున్నారు. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఆ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











