‘RRR’కు షాకిచ్చేందుకు బడా ఫిల్మ్ మేకర్ల స్కెచ్.. థియేటర్లు కూడా దక్కకుండా ప్లాన్.!
'బాహుబలి' వంటి సంచలన సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'RRR'. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను ఈ ప్రాజెక్టులో భాగం చేయడానికి తోడు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకే ఈ సినిమాపై టాలీవుడ్తో పాటు అన్ని ఇండస్ట్రీలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అదే సమయంలో కొందరు ఈ సినిమాపై అక్కసు వెల్లగక్కుతున్నారు. ఇంతకీ వాళ్లు ఎవరు.? ఎందుకు ఇలా చేస్తున్నారు.?

బాహుబలితో మారిపోయింది
తెలుగు సినిమా స్టామినా గురించి గతంలో చాలా చిత్రాలు దేశ వ్యాప్తంగా చాటి చెప్పాయి. అయితే, దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి' దీనిని ప్రపంచ వ్యాప్తం చేసింది. ఈ సినిమా దేశంలోనే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడంతో పాటు ఎన్నో అవార్డులు దక్కించుకుంది. జక్కన్న మాయాజాలానికి ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు ఫిదా అయిపోయారు. దీంతో అన్ని ఇండస్ట్రీల దృష్టి తెలుగు సినిమాపై పడింది.

ఈ సినిమాతో అక్కసు కూడా..
భారతీయ సినిమాపై ‘బాహుబలి' ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడు తెలుగు సినిమా బలానికి చాలా మంది ఆశ్చర్యపోయారు. అదే సమయంలో మన ఇండస్ట్రీపై చాలా మంది అక్కసుకు కూడా వెల్లగక్కారు. అప్పటి వరకు ఉన్న హిందీ సినిమాల రికార్డులను బాహుబలి బద్దలు కొట్టడంతో బాలీవుడ్లోని ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు కుట్రలు కూడా పన్నుతున్నారన్న వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

సైరా: నరసింహారెడ్డికి పోటీగా వార్
తెలుగు సినిమాలను, వాటి మార్కెట్ను దెబ్బకొట్టేందుకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు ప్రయత్నాలను ముమ్మరం చేసేశారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న‘సైరా: నరసింహారెడ్డి' సినిమాకు పోటీగా ఓ భారీ చిత్రాన్ని తీసుకుని వచ్చారు. టైగర్ ష్రాఫ్ - హృతిక్ కలిసి నటించిన ‘వార్' కూడా సైరా విడుదలయ్యే రోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాను సిద్దార్ద్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.

‘RRR'ను దెబ్బకొట్టేందుకు ప్లాన్
ఇక, తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘RRR'కు పోటీగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు మరికొన్ని చిత్రాలను తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు సినిమాకు మంచి పేరు వస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు చేసి, దాన్ని దెబ్బకొట్టాలని వాళ్లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, హిందీలో కూడా విడుదలవుతున్న ఈ చిత్రానికి థియేటర్లు సైతం దొరక్కుండా చేయాలని వాళ్లు స్కెచ్ వేసినట్లు ఉత్తరాదిలో ప్రచారం జరుగుతోంది.

ఎన్నో చిత్రాలు వస్తున్నాయి
‘RRR'ను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఈ సినిమా హిందీతో సహా పలు భాషల్లో విడుదల అవుతోంది. దీంతో అక్కడి ఫిల్మ్ మేకర్లు సల్మాన్ నటిస్తున్న ‘ఇన్షా అల్లా' చిత్రాన్ని కూడా జూలై 30న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అలాగే, అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న కాప్ స్టోరీని కూడా జూలై 31న ప్రేక్షకుల మందుకు తీసుకొస్తారని తెలిసింది. వీటితో పాటు చంద్రముఖి -2 రీమేక్ ‘భూల్ భులయ్య' కూడా జూలై 31నే విడుదల చేస్తారని టాక్.

‘RRR' గురించి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR'. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











