సైరా నరసింహారెడ్డి కోసం అమిత్ త్రివేది.. ఇంకా తేలని వ్యవహారం, ఫోకస్ పెట్టిన రాంచరణ్!
2019 లో విడుదల కాబోతున్న చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం చాలా ప్రతిష్టాత్మకమైనది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల్ని ఎంపిక చేయడానికే చాలా సమయం పట్టింది. ఇంకా ఓ సమస్య చిత్ర యూనిట్ ని వెంటాడుతూనే ఉంది. దానిపై రాంచరణ్ ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంకా కుదర్లేదు
ఈ చిత్రానికి మొదట ఏఆర్ రెహమాన్ ని సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన రెహమాన్ ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సరైన సంగీత దర్శకుడి కోసం రాంచరణ్ అన్వేషిస్తూనే ఉన్నాడు.

షూటింగ్ శరవేగంగా
సాధారణంగానే సినిమా షూటింగ్ ప్రారంభంలోనే మ్యూజిక్ సింట్టింగ్స్ పూర్తవుతాయి. కానీ సైరా చిత్రానికి ఇంతవరకు సంగీత దర్శకుడే ఎంపిక కాలేదు. కీరవాణి, తమన్ వంటి సంగీత దర్శకుల పేర్లు వినిపించినా ఏదీ ఫైనల్ కాలేదు.

బాలీవుడ్ సంగీత దర్శకుడు
తాజా జరుగుతున్న ప్రచారం ప్రకారం బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పట్ల రాంచరణ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీత అందించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అమిత్ త్రివేది ఇష్క్ జాదే, క్వీన్ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించాడు.

టీజర్ అప్పుడే
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకని పురస్కరించుకుని ఆగష్టు 22 న సైరా టీజర్ విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కనుక నిజమైతే మెగా అభిమానులకు పండగే.


Click it and Unblock the Notifications











