నటసింహా బాలకృష్ణ ‘శ్రీరామ రాజ్యం’పై కోర్టులో కేసు...!
బాలకృష్ణ, బాపు కాంబినేషన్లో రూపొందిన 'శ్రీరామరాజ్యం' సినిమాపై ఓ ఫైనాన్షియర్ కోర్టుకెక్కారు. ఈ చిత్ర నిర్మాత తన నుంచి కొంత సొమ్ము తీసుకున్నారనీ, అయితే తన డబ్బు తిరిగి చెల్లించలేదనీ ఆ ఫైనాన్షియర్ హైదరాబాదు సివిల్ కోర్టులో కేసు వేశారు. దీనిపై నిన్న విచారణ చేపట్టిన న్యాయమూర్తి రాధారాణి, కొన్ని షరతులతో సినిమా విడుదలకు అనుమతిచ్చారు. ఆ మొత్తాన్ని నిర్మాత సదరు ఫైనాన్షియర్ కు చెల్లించినా, లేక కోర్టుకు జమచేసినా చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా శ్రీరామరాజ్యం సినిమా ఈ నెల 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాలో బ్రహ్మానందం చాకలి తిప్పడు" పాత్రను చేశాడు. ఆ పాత్ర రజకుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉంటుందేమోనని ఆ వర్గం వారు వివాదం రేపారని వార్తలు తెలియవస్తున్నాయి. ఈ చిత్రం నుంచి చాకలి తిప్పడు పాత్రను తొలగించాలని రజక సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారని సమాచారం. మరి ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాపు దర్శకత్వంలో బాలయ్య, నయనతార సీతారాములుగా రూపొందిన ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











