రామ్ చరణ్ బాటలో ఎన్టీఆర్.. అలా కూడా సక్సెస్ అవుతాడా..?
టాలీవుడ్ టాప్ హీరోలు చిత్ర నిర్మాణాలపై ఫోకస్ పెడుతున్నారు. ఒకవైపు నటిస్తూనే మరోవైపు ప్రొడక్షన్ వైపు కన్నేస్తున్నారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ సహాయంతోనే లేదా సొంతంగానే సినిమాలను నిర్మిస్తూ నిర్మాణంలోనూ దూసుకుపోతున్నారు. హీరోలుగా సక్సెస్ అవ్వడమే కాకుండా నిర్మాతలు గానూ విజయం సాధిస్తున్నారు. ఇక ఈ జాబితాలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతోన్నాడు.

నిర్మాణంవైపు హీరోల చూపు..
మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు నిర్మాతలుగా మారి విజయాలు అందుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఎన్బీకే ప్రొడక్షన్స్ స్థాపించి ఎన్టీఆర్ బయోపిక్ను అత్యంత భారీ ఎత్తున నిర్మించారు. నాగార్జున అయితే ఎప్పటి నుంచి చిత్రాలను నిర్మిస్తూ ఉన్నాడు. సొంత సినిమాలనే కాకుండా నచ్చిన కథ నచ్చితే చిన్న హీరోలతోనూ, కొత్త వారితోనూ నిర్మించి పెద్ద విజయాలను అందుకున్నాడు నాగ్.

కొణిదెల ప్రొడక్షన్స్తో రామ్ చరణ్..
చిరంజీవిని రీఎంట్రీ ఇచ్చేందుకు రామ్ చరణ్ కొణిదెల ప్రొడెక్షన్స్ను స్థాపించాడు. తన తండ్రిని మళ్లీ వెండితెరపై రారాజులా చేసేందుకు భారీ ఎత్తున ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని నిర్మించాడు. నిర్మాతగా మొదటి చిత్రంతోనే భారీ లాభాలను చేజిక్కించుకున్నాడు రామ్ చరణ్. సైరా చిత్రాన్ని జాతీయ స్థాయిలో నిర్మించి.. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. సైరాను అద్భుతంగా తెరకెక్కించినందుకు టాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ను ప్రత్యేక అభినందించారు.

యూవీ క్రియేషన్స్లో ప్రభాస్..
యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత బ్యానర్. మిర్చి సినిమాతో యూవీ క్రియేషన్ భారీ లాభాలను సమకూర్చుకుంది. అయితే యూవీ క్రియేషన్స్ వేరే హీరోలతోనూ సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉంది. సాహో సినిమాను ప్రభాస్ ఇమేజ్కు తగ్గట్లు నిర్మించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మహేష్ బాబు సైతం..
శ్రీమంతుడు సినిమాతో నిర్మాతగా మారి.. ఆ మూవీలో కొంత షేర్లను సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. మైత్రీ మూవీస్తో భాగస్వామ్యం అయ్యాడు. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో మహేష్ ఫుల్ ఖుషీ అయ్యాడు. అంతేకాకుండా థియేటర్ రంగంలోకి మహేష్ దిగాడు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఏఎమ్బి అందర్నీ ఆకర్షించింది.

నాని, విజయ్ దేవరకొండలు..
నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా సినిమాలు నిర్మిస్తూ సక్సెస్లు సాధిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అ! సినిమాను తెరకెక్కించి నాని ప్రశంసలు అందుకున్నారు. మీకు మాత్రమే చెప్తా అంటూ తరుణ్ భాస్కర్ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారాడు.

తాజాగా ఎన్టీఆర్..
హీరోగా ఫుల్ ఫామ్లో ఉన్న ఎన్టీఆర్.. నిర్మాతగా మారేందుకు రంగం సిద్దం చేసుకుంటోన్నట్లు టాక్. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి స్వంతంగా చిత్రాలను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండగా.. ఆ తరువాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ప్రాజెక్ట్ను చేయనున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాను తన స్వంత బ్యానర్లోనే నిర్మిస్తాడా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











