బాలయ్య-వినాయక్ మళ్లీ మొదటికి.. ఆ చిత్రాన్ని మించి..నిర్మాత అతడే
నందమూరి నటసింహం బాలకృష్ణ రూలర్ అంటూ గర్జించబోతోన్నాడు. కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ తరువాత.. వీరి కాంబినేషన్లో రాబోతోన్న ఈ మూవీ ఇప్పటికే భారీ హైప్ను క్రియేట్ చేసింది. బాలయ్య లుక్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్తో అభిమానుల్లో అంచనాలు పెంచేసింది చిత్ర యూనిట్.
మామూలుగా అయితే 'రూలర్' కంటే ముందు బాలకృష్ణ - వినాయక్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కాల్సింది. వినాయక్ కూడా బాలయ్యకు కథలు వినిపించాడని టాక్. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. దాంతో సి.కల్యాణ్.. కె.ఎస్ రవికుమార్తో 'రూలర్'పట్టాలెక్కించాడు బాలయ్య. ఖాళీగా ఉన్న వినాయక్ కూడా పనిలో పనిగా కొత్త అవతారమెత్తి హీరోగా మారాడు. శీనయ్య అంటూ కొత్త ప్రాజెక్ట్తో బిజీ అయ్యాడు.

తాజాగా బాలయ్య-వినాయక్ మూవీపై మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. వినాయక్ బాలయ్య కోసం ఓ కధ సిద్ధం చేయనున్నారని, ఆ సినిమాకి తానే నిర్మాతగా వ్యవహరిస్తానని సి.కల్యాణ్ చెప్పుకొచ్చాడు. బాలయ్య కోసం వినాయక్ చాలా కథలు సిద్ధం చేశారని, అయితే అవేం పెద్దగా కిక్ ఇవ్వకపోవడం వల్లే ఆ సినిమా ముందుకు వెళ్లలేదని, ఈసారి వినాయక్ బాలయ్య కోసం 'చెన్నకేశవరెడ్డి' కంటే శక్తివంతమైన సినిమా చేయాలని భావిస్తున్నాడని, అలాంటి కథ త్వరలోనే రానుందని, ఆ చిత్రానికి తానే నిర్మాత అని సి.కల్యాణ్ చెప్పారు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. డిసెంబర్ 20న రూలర్ అంటూ రాబోతోన్న బాలయ్యపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











