చిరంజీవి సంచలన నిర్ణయం: తెలుగులో వచ్చిన సినిమా రీమేక్కు రెడీ.. హిట్లు ఇచ్చిన డైరెక్టర్తోనే!
స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి.. తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్, స్టైల్స్తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆయన.. ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నారు. ఇక, ఇప్పుడు చిరంజీవి మరో రీమేక్ మూవీని చేసేందుకు పచ్చజెండా ఊపినట్లు తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

రీఎంట్రీలో వరుస చిత్రాలతో హవా
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి యమ జోష్లో కనిపిస్తున్నారు. 'ఖైదీ నెంబర్ 150'తో కమ్బ్యాక్ అయిన ఆయన.. ఆ తర్వాత వరుసగా 'సైరా: నరసింహారెడ్డి', 'ఆచార్య', 'గాడ్ పాదర్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. వీటిలో 'ఖైదీ నెంబర్ 150' మినహా మిగిలినవి ఆశించిన రీతిలో ఆడలేదు. అయినప్పటికీ చిరంజీవి మాత్రం దూసుకెళ్తోన్నారు.

వాల్తేరు వీరయ్యతో భారీ విజయం
ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రవితేజ కూడా కీలక పాత్రను చేసిన ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కించాడు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా ఇది భారీ విజయం దిశగా సాగుతోంది.

భోళా శంకర్గా.. అప్పుడే మొదలెట్టి
చాలా రోజుల క్రితమే టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' మూవీని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్గా రాబోతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ 30 శాతం వరకూ పూర్తైంది. ఇక, తాజాగా చిరంజీవి ఈ మూవీ షూటింగ్ను పున: ప్రారంభించారు.

మరింత పెద్ద లైనప్.. ఆ డైరెక్టర్లు
సినిమాల్లోకి కమ్బ్యాక్ అయిన తర్వాత చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటోన్నారు. ఇలా ఇప్పటికే కొన్ని సినిమాలతో వచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడాయన మరికొన్ని ప్రాజెక్టులను మొదలెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొందరు యంగ్ డైరెక్టర్లతో ఆయన చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ వివరాలు బయటకు రానున్నాయి.

మరో రీమేక్ చేసేందుకు నిర్ణయం
రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఐదు సినిమాలను చేశారు. అందులో 'ఖైదీ నెంబర్ 150', 'గాడ్ ఫాదర్'తో పాటు ఇప్పుడు పట్టాలపై ఉన్న 'భోళా శంకర్'లు రీమేక్లుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన తమిళంలో అజిత్ హీరోగా నటించిన 'విశ్వాసం' చిత్రాన్ని కూడా రీమేక్ చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

2 హిట్లు ఇచ్చిన దర్శకుడికి ఛాన్స్
ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి సూపర్ హిట్ అయిన 'విశ్వాసం' మూవీని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతలను ఆయన సీనియర్ డైరెక్టర్ వీవీ వినాయక్ను అప్పగించినట్లు తెలిసింది. ఇప్పటికే సదరు దర్శకుడు ఈ కథలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీళ్ల కాంబోలో 'ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150' వచ్చిన విషయం తెలిసిందే.

వచ్చే సంక్రాంతికి రావాలని ప్లాన్
వాస్తవానికి 'విశ్వాసం' మూవీ తెలుగులోనూ విడుదలైంది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని చిరంజీవి రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక, ఈ మూవీకి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రానుందని తెలిసింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని కూడా అప్పుడే ప్లాన్ చేశారట. దీనిపై మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











