Acharya రిలీజ్ డేట్ ఫిక్స్: స్పెషల్ డేకు ఒకరోజు ముందే.. అప్పుడలాంటి ఫలితం రావడంతో!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నారు. ఇక, ప్రస్తుతం ఈ సీనియర్ హీరో 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలవగా.. పలు ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ భాగం ఇంకా పూర్తి కాలేదు.
'ఆచార్య' షూటింగ్ గురించి తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేసింది. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తైందని అందులో పేర్కొంది. అయితే, ఓ రెండు పాటల చిత్రీకరణ మాత్రం ఇప్పటికీ బ్యాలెన్స్ ఉందని కూడా వెల్లడించింది. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో అన్ని భారీ చిత్రాల మాదిరిగా దీని కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించాలని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఆచార్య' మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య' మూవీని అక్టోబర్ 1న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే దీని గురించి దర్శకుడు కొరటాల శివతో చిరంజీవి, రామ్ చరణ్ కూడా చర్చలు జరిపారని అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ రెండు పాటలను చిత్రీకరించి అక్టోబర్ 1న దీన్ని విడుదల చేయాలని యోచిస్తున్నారట. ఇక, దీనికి సంబంధించిన ప్రకటనను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ప్రకటించబోతున్నారని మెగా కాంపౌండ్ నుంచి సమాచారం అందుతోంది.

ఇదిలా ఉండగా.. గతంలో చిరంజీవి హీరోగా నటించిన 'సైరా: నరసింహారెడ్డి' మూవీ గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో ప్రతికూల ఫలితం వచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు 'ఆచార్య'ను అదే నెలలో విడుదల చేసేందుకు చిరంజీవి ముందుకు వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ మూవీపై ఆయనకు ఆ రేంజ్లో నమ్మకం ఉందని అర్థం అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆచార్య' కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే సందేశాత్మకంగా సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఓ మిషన్లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మెగా మల్టీస్టారర్గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్బుక్, ట్విట్టర్ , ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











