మరోసారి రిపీట్ చేసిన త్రివిక్రమ్.. ఇంతకీ అందులో మర్మం ఏముందో మరి!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తుంటారు. సినిమా టైటిల్స్ విషయంలో, కాంబినేషన్ విషయంలో ఈ సెంటిమెంట్ ఎక్కువగా వర్కవుట్ చేస్తుంటారు. బడా, చోటా దర్శకనిర్మాతలు ఎవ్వరూ ఇందుకు అతీతులు కారు. ఈ కోవలోనే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన సెంటిమెంట్ వర్కవుట్ చేస్తున్నాడా? అనే సందేహం కలుగుతోంది జనాల్లో.
తాజాగా త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు 'అల.. వైకుంఠపురములో' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశాడు ఈ మాటల మాంత్రికుడు. ఇక్కడే ఆయన సెంటిమెంట్ బయటపడింది. అచ్చ తెలుగు టైటిల్స్కి పెట్టింది పేరైన త్రివిక్రమ్.. ఈ టైటిల్ ద్వారా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

అయితే గతంలో ''అతడు, అత్తారింటికి దారేది, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత'' లాంటి టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన తాజాగా మళ్ళీ 'అ' సెంటిమెంట్ తోనే వర్కవుట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడంటూ ఫిలింనగర్ సర్కిల్స్ కోడై కూస్తున్నాయి. అంతేకాదండోయ్! 'అ' అక్షరంలో ఏదో మర్మం ఉండబట్టే త్రివిక్రమ్ ఈ సెంటిమెంట్ కొనసాగిస్తూ వస్తున్నాడని చెప్పుకుంటున్నారు. 'అ' అనే అక్షరం ముందుగా వచ్చే టైటిల్తో ఆయన తెరకెక్కించిన సినిమాల్లో 'అజ్ఞాతవాసి' మినహాయిస్తే మిగితావన్ని సూపర్ హిట్ సినిమాలే. కాబట్టి ఈ సారి కూడా 'అ' సెంటిమెట్ వర్కవుట్ అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక&హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురం'లో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దే నటిస్తోంది. సీనియర్ నటి టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











