దాసరి వద్ద ‘అధినాయకుడు’ పంచాయితీ!?
బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' చిత్రం చాలా రోజుల క్రితమే విడుదలవ్వాల్సి ఉంది. అయితే ఆ చిత్ర నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి అప్పుల్లో కూరుకు పోవడంతో సినిమా విడుదలకు అడ్డంకి మారిందని వార్తలు వచ్చాయి. సినీ వర్గాలు నుంచి వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం చౌదరి దిల్ రాజుకు, ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారికి, మరికొందరికి బాకీ పడ్డాని ఓ ప్రముఖ వెబ్సైట్లో వార్తాకథనం వచ్చింది.
ఆ వెబ్సైట్ కథనం ప్రకారం - తమ అప్పు చెల్లించే వరకు సినిమా విడుదల చేయడానికి వీల్లేదని సదరు వ్యక్తులు అడ్డు పడుతున్నారని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పరిష్కారం కోసం సినీ పరిశ్రమలో పెద్దమనిషి అయిన దర్శక రత్న దాసరి నారాయణ వద్ద సోమవారం పంచాయతీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
బాకీ చెల్లించకుండా సినిమా విడుదల చేయడానికి అప్పు ఇచ్చిన వారంతా తొలుత ససే మిరా అన్నప్పటికీ....కుమార్ చౌదరి దిక్కుతోచని పరిస్థితిలో ఉండటంతో దాసరి మాట మేరకు పంచాయితీ ఓ కొలిక్కి వచ్చిందని, చివరకు సినిమా విడుదలకు ఒప్పుకున్నారని చర్చించుకుంటున్నారు. ఈ మేరకు 'అధినాయకుడు'ను ఏప్రిల్ 20న కాకుండా, మే 4న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈచిత్రం విడుదలకు అటు ఇటుగా దమ్ము, దరువు, గబ్బర్ సింగ్ చిత్రాలు విడుదలవుతుండటంతో 'అధినాయకుడు' సినిమాకు కలెక్షన్లు రాలుతాయా? నిర్మాత కష్టాలు తీరుతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
బాలకృష్ణ త్రిపాత్రాభినయంతో లక్ష్మీరాయ్, సలోని కథానాయికలుగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై పరుచూరి మురళి దర్శకత్వంలో అధినాయుకడు చిత్రం రూపొందింది. తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు వైవిధ్యమైన పాత్రల్లో బాలకృష్ణ గత చిత్రాలకంటే భిన్నంగా కనిపించనున్నాడు. జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేందర్రెడ్డి, సంగీతం: కల్యాణి మాలిక్, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











