Kayadu Lohar : డ్రాగన్ బ్యూటీకి మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్.. ఆ మూడు క్రేజీ ఆఫర్స్తో!
హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ సాగేది చాలా తక్కువ. మహా అయితే మూడు నాలుగేళ్లే. అది కూడా అందాన్ని కాపాడుకుంటూ, మంచి హిట్స్ పడితేనే. లేనిపక్షంలో వచ్చామా? వెళ్లామా అన్నట్లుగా జీవితం మారుతుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్నట్లుగా దూసుకెళ్తారు. వరుసపెట్టి సినిమాలు, బ్రాండ్ అండార్స్మెంట్స్ వంటి కార్యక్రమాలతో రెండు చేతుల సంపాదిస్తారు. సినిమాలు హిట్ అయితే అమాంతం రెమ్యునరేషన్ పెంచడం హీరోయిన్లు ఆనవాయితీగా చేసుకుంటున్నారు. తాజాగా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు డ్రాగన్ బ్యూటీ కాయద్ లోహర్.
పేరుతోనే పాపులర్
అస్సాంకు చెందిన కాయదు లోహర్ 11 ఏప్రిల్ 2000న తేజ్పూర్లో పుట్టింది. కామర్స్ పట్టభద్రురాలైన ఈ ముద్దుగుమ్మ తొలుత మోడలింగ్ ద్వారా అదృష్టం పరీక్షించుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవ్రీ యూత్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12 కిరీటం గెలుచుకున్నారు. ఈ దశలో వెండితెర వైపు అడుగులు వేసిన కాయదు లోహర్ 2021లో కన్నడంలో ముగిల్పేట్ సినిమాతో ముఖానికి మేకప్ వేసుకున్నారు. అనంతరం పాతోన్పాతమ్ నూట్టండు అనే మలయాళం సినిమాలో నటించారు.

టాలీవుడ్కు పరిచయం చేసిన శ్రీవిష్ణు
తన సినిమాలలో కొత్త హీరోయిన్లను తీసుకునే అలవాటున్న కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు కళ్లలో కాయదు పడింది. ఇంకేముందు 2022లో తను నటించిన అల్లూరి చిత్రంలో ఆమెకు హీరోయిన్గా అవకాశం కల్పించారు. వైట్ స్కిన్ టోన్తో ముద్దుగా బొద్దుగా ఉండే కాయదు అందాలకు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అయితే అల్లూరి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో కాయదు లోహర్కు నిరాశ ఎదురైంది. దీంతో టాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు దక్కలేదు. ఈ నేపథ్యంలో తమిళ, మరాఠీ, మలయాళ చిత్రాల్లో కాయద్ లోహర్ అవకాశాలు అందుకున్నారు.
డ్రాగన్తో ఓవర్ నైట్ స్టార్గా
అలాంటి దశలో ఏడాది ప్రారంభంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన లవ్, రొమాంటిక్ మూవీ డ్రాగన్ చిత్రం కాయదు లోహర్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఇందులో పల్లవి పరశురామ్గా నటించిన కాయదు యాక్టింగ్కు యువత వెర్రెక్కిపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ఓ పార్టీ సాంగ్లో ఆమె స్టెప్స్, లుక్స్ వైరల్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సాంగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ దెబ్బతో కాయదు లోహర్ కోలీవుడ్లో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్గా మారిపోయారు.
కాయదు లోహర్కు వరుస అవకాశాలు
డ్రాగన్ బ్లాక్బస్టర్ కావడంతో కాయదు లోహర్ స్టార్ హీరోల కళ్లలో పడ్డారు. కోలీవుడ్ యువ హీరో అధర్వ నటిస్తున్న ఇదయం మురళీ... మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్ కుమార్ నటిస్తున్న ఇమ్మోర్టల్ సినిమాలో ఛాన్స్ అందుకున్నారు. తెలుగులో నాని ది ప్యారడైజ్తో పాటు విశ్వక్సేన్ అనుదీప్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలోనూ కాయదు లోహర్ హీరోయిన్గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. అలాగే కోలీవుడ్ సీనియర్ హీరో శింబు 49వ చిత్రంలోనూ కాయదు సెలెక్ట్ అయినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కోలీవుడ్లో బిజీ హీరోయిన్గా
టాలీవుడ్, కోలీవుడ్లలో బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఈ దెబ్బతో పారితోషికం కూడా భారీగా పెంచినట్లుగా చిత్రసీమలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. కాయదు లోహర్ ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. ప్రస్తుతం సినిమాకు ఆమె రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని ఫిలింనగర్ టాక్. డ్రాగన్ మూవీకి గాను కేవలం రూ.30 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్న కాయదు లోహర్కు సినిమా సూపర్ హిట్ కావడంతో నిర్మాతలు మరో రూ.70 లక్షలు ఇచ్చినట్లుగా కోలీవుడ్లో ప్రచారం జరిగింది.


Click it and Unblock the Notifications











