RCB: ఐపీఎల్లోకి ప్రభాస్ ప్రొడ్యూసర్.. కోహ్లీ టీమ్పై కన్ను? డీల్ ఎన్ని వేల కోట్లో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ గమనాన్ని సమూలంగా మార్చేసిన చరిత్ర ఐపీఎల్ సొంతం. బీసీసీఐని మరింత శక్తివంతం చేయడంతో పాటు క్రికెటర్లను మరింత ధనవంతులుగా మార్చేసింది. ఎంతో మంది వర్థమాన క్రికెటర్లను పరిచయం చేసింది. ఐపీఎల్ హిస్టరీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుది ప్రత్యేక చరిత్ర. ఐపీఎల్ టైటిల్ గెలవడానికి దాదాపు 18 సీజన్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. పేపర్ మీద బలంగా కనిపించడం, సీజన్ మొదలయ్యాక నిరాశపరచడం ఆ జట్టుకు ఆనవాయితీగా మారింది. అయితే అందరి ఎదురుచూపులు ఫలించి 18 ఏళ్ల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ఈ జట్టు ముద్దాడింది. ఈ జోష్లో ఉండగానే ఆర్సీబీ జట్టు అభిమానులకు షాకిచ్చింది.
ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి హోంగ్రౌండ్కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ టీమ్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోగా... పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను విషాదంలోకి నెట్టింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించి ప్రత్యేక కమీషన్ను ఏర్పాటు చేసింది. నగరం మధ్యలో ఉన్న చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు ఏర్పాటు చేయొద్దని, భారీగా జనసమూహాలు గుమిగూడటానికి సరైంది కాదని ప్రకటించింది.

అయితే కమీషన్ నిర్ణయం ఆర్సీబీ అభిమానులకు షాకిచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తమ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశం లేకుండా పోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో హోంగ్రౌండ్ కోసం ఆర్సీబీ జట్టు వెతికే పనిలో పడింది. పుణే స్టేడియాన్ని ఇందుకోసం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతలోనే ఆ జట్టు మరో షాకిచ్చింది. ఐపీఎల్ 2026 కోసం 8 మంది స్టార్ ఆటగాళ్లను విడుదల చేసి.. 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.
అయితే ఆర్సీబీని యాజమాన్యం అమ్మకానికి సిద్ధం చేసిందనే వార్తలతో క్రికెట్ వర్గాల్లో కలకలం రేగింది. ప్రస్తుతం ఆర్సీబీ యజమాని బ్రిటీష్ లిక్కర్ దిగ్గజం డియాజియో తన వాటాను పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయించాలని నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 16,834 వేల కోట్ల రూపాయలు) ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
డియోజియో పీఎల్సీ... తమ ఐపీఎల్ ఫ్రాంచైజీని విక్రయించాలని నిర్ణయం తీసుకున్న వెంటనే ఆర్సీబీని దక్కించుకునేందుకు బడా సంస్థలు పోటీలో నిలిచాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంటి దిగ్గజ కంపెనీలు పోటీలో ఉన్నాయి. అయితే అనూహ్యంగా దక్షిణాదిలో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ పోటీలో ఉన్నట్లు సమాచారం. విజయ్ కిరగందూర్, చాలువే గౌడలు కలిసి సంయుక్తంగా హోంబలే ఫిల్స్మ్ బ్యానర్ను స్థాపించారు. కేజీఎఫ్ సిరీస్.. కాంతార, కాంతార చాప్టర్ 1, సలార్, మహావతార్ నరసింహా వంటి భారీ బ్లాక్బస్టర్స్ నిర్మించింది.
అయితే వందల కోట్ల రూపాయలు ఆర్జించిన హోంబలే సంస్థ.. దాదాపు 17 వేల కోట్ల రూపాయలు సమకూర్చగలదా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది గాలివార్తా? లేక నిజంగానే 17 వేల కోట్ల రూపాయలు రెడీ చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సొంతం చేసుకుంటుందా? అనేది త్వరలోనే తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











