ప్రభాస్ - మారుతి మూవీ నుంచి మరో లీక్.. ఆ సీన్స్కు సీట్లలో కూర్చోలేరట
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. తన టాలెంట్లను బయట పెట్టుకుని.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అలా సుదీర్ఘ కాలం పాటు ఎన్నో సినిమాలను అందించిన అతడు.. 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తోన్నాడు. ఇలా ఇప్పుడు ప్రశాంత్ నీల్తో 'సలార్', ఓం రౌత్తో 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్తో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్ మూవీకి సిగ్నల్ ఇచ్చాడు.
ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను ఓకే చేసేసిన ప్రభాస్.. ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్' (పరిశీలనలో ఉన్న పేరు) అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ఎంతో రహస్యంగా జరుగుతోంది. ఇందుకోసం ఓ బంగ్లా సెట్ను నిర్మించి, అందులో చిత్రీకరణ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే దాదాపుగా 60 శాతానికి పైగా షూటింగ్ను కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి క్రేజీ న్యూస్ లీకైంది.

హర్రర్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ దెయ్యం పాత్రను చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఆయన సీన్స్ అన్నీ అదిరిపోయేలా వచ్చాయని తెలిసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో హర్రర్ సీన్స్, వాటి వెనుక వచ్చే సౌండ్స్ ఓ రేంజ్లో భయపెట్టేలా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు.. ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వని విధంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇందులో టాలీవుడ్లో గతంలో చూడని కొత్త ఎక్స్పీరియన్స్ను అందించబోతున్నారని టాక్.
ప్రభాస్ - మారుతి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











