ఎలక్షన్ హీట్లో బాలయ్య.. ఇద్దరికీ పెద్ద పరీక్ష!
Recommended Video

దర్శకుడు బోయపాటి శ్రీను చివరగా రూపొందించిన వినయ విధేయ రామ చిత్రం నిరాశపరిచింది. సంక్రాంతికి విడుదలైన వినయ విధేయ రామ చిత్రం రాంచరణ్ అభిమానులని ఆకట్టుకోలేక పోయింది. దీనితో బోయపాటి తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. బాలయ్యతో హ్యాట్రిక్ మూవీకి సిద్ధం అవుతున్నట్లు బోయపాటి శ్రీను గతంలోనే ప్రకటించాడు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇక వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

ఇద్దరికీ పెద్ద పరీక్ష
బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామ చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రంలో బోయపాటి మాస్ మంత్రం ఫలించలేదు. బోయపాటి విమర్శలకు కూడా గురయ్యారు. దీనితో బోయపాటి తదుపరి చిత్రంతో తప్పనిసరిగా సత్తా చాటాలి. ఇక బాలయ్య పరిస్థితి కూడా అంతే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం దారుణమైన పరాజయానికి గురైంది. రెండు భాగాలలో ఒక్కటి కూడా సరిగా ఆడలేదు. దీనితో బాలయ్య బోయపాటి పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం వీరిద్దరికి పెద్ద పరీక్షే అని చెప్పొచ్చు.

ఎలక్షన్ హీట్లో
ఇటీవల మహానాయకుడు ప్రచారం సందర్భంగా బోయపాటి దర్శత్వంలో నటించే చిత్రాన్ని ఎన్నికల తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించాడు. తాజాగా బాలయ్య నిర్ణయం మార్చుకున్నాడో లేక సినిమా ప్రారంభానికి మంచి ముహూర్తం కుదిరిందో ఏమో కానీ బోయపాటి దర్శత్వంలో చిత్రాన్ని మార్చి 28న ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల హీట్ పెరిగింది. బోయపాటి సినిమా ప్రారంభించే సమయానికి మరింతగా ఎన్నికల హడావిడి పెరుగుతుంది.

ఎన్నికల ప్రచారంలో
బాలయ్య ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.బోయపాటి సినిమా ప్రారంభోత్సవం జరిగాక టిడిపి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. బోయపాటి ఇప్పటికే బాలయ్య బాడీలాంగ్వేజ్ కు సరిపడే కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బోయపాటి సినిమా అంటే ఖచ్చితంగా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. కొత్తదనంతో కూడిన అంశాలు ఏమైనా ఈ చిత్రంలో ఉంటాయా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

సి కళ్యాణ్ నిర్మాణంలో
మొదట ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలయ్యే తన ఎన్బీకె ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ చిత్ర నిర్మాతగా సి కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ నిరాశపరిచిన తర్వాత ఇక చిత్రనిర్మాణం జోలికి వెళ్లకూడదని బాలయ్య నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











