నిర్మాతగా రాజమౌళి.. లెజెండ్ బయోపిక్లో హీరోగా జూ ఎన్టీఆర్
తెలుగు సినిమా పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుల్లో దర్శక ధీరుడుగా పేరున్న రాజమౌళి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే తాను దర్శకత్వం వహించే సినిమాలతోనే మూడు, నాలుగేళ్లు బిజీగా ఉంటారు. ఇతర సినిమాల గురించి పెద్దగా పట్టించుకొన్నట్టు కనిపించారు. కానీ మహేష్ బాబుతో గ్లోబల్ మూవీ రూపొందిస్తున్న జక్కన ప్రస్తుతం నిర్మాతగా మారారు. అయితే సినిమా పరిశ్రమకు ఆదిపురుషుడు, మూల పురుషుడిగా నిలిచిన సినీ లెజెండ్పై రూపొందించే సినిమాకు నిర్మాతగా మారడం విశేషంగా మారింది. ఈ ప్రాజెక్టకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరున్న దాదా సాహెబ్ ఫాల్కే మహరాష్ట్రలోని త్రయంబక్లో జన్మించారు. 1913 సంవత్సరంలో రాజా హరిచంద్ర అనే సినిమా రూపొందించి భారతీయ సినిమా పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచారు. అప్పట్లో ఆయన ఈ సినిమాను సుమారుగా 15 వేల రూపాయలతో నిర్మించారు. దాదాపు ఆయన 90 సినిమాలను రూపొందించారు. అలాగే 50 షార్ట్ ఫిలింస్ కూడా తెరకెక్కించారు. ఆయన భారతీయ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. సినిమా రంగానికి విశేషంగా సేవలు అందించిన వారికి ఆయన పేరుతో ఫాల్కే అవార్డును అందించడం తెలిసిందే. అలాంటి గొప్ప సినీ ప్రముఖుడి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం మొదలైంది.

మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్తో పాన్ ఇండియా మూవీగా ఫాల్కే బయోపిక్ తెరకెక్కనున్నది. ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తీకేయ, బాలీవుడ్ ప్రముఖుడు వరుణ్ గుప్తా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి నిర్మాతగా వ్యవహరిస్తారు. జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను ఆరు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే పాత్రను యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ పోషిస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వార్త గురించి అటు ఎన్టీఆర్ వర్గాలు కానీ.. ఇటు రాజమౌళి టీమ్ గానీ ఇప్పటి వరకు ధృవీకరించలేదు. అయితే ఈ సినిమా గురించి ఎన్టీఆర్తో ఇప్పటికే చర్చలు జరిగాయి. ఆయన ఈ పాత్రను పోషించేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
ఇక రాజమౌళి, ఎన్టీఆర్ కెరీర్ విషయాలకు వస్తే.. RRR సినిమా తర్వాత దేవర సినిమాతో ఎన్టీఆర్ విజయం అందుకొన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తొలి బాలీవుడ్ సినిమా వార్ 2 మూవీ రిలీజ్కు సిద్దంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్, దేవర 2 సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక రాజమౌళి విషయానికి వస్తే..ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











