తమన్కు అల్లు అర్జున్ షాక్ ... త్రివిక్రమ్ చేతులెత్తేశాడా?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. రూ.1850 కోట్లకు పైగా వసూళ్లతో భారతదేశంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. రూ.2000 కోట్ల వసూళ్ల దిశగా వడివడిగా దూసుకెళ్తున్న పుష్ప 2 త్వరలోనే ఆ రికార్డును కూడా బద్ధలు కొట్టేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పుష్ప 2 విడుదల ఏమో కానీ అల్లు అర్జున్ తన జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కోంటున్నారు. పుష్ప 2 ది రూల్ విడుదలకు ముందు రోజు హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే వివాహిత ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయగా , ఆయనకు తొలుత నాంపల్లి కోర్ట్ తాత్కాలిక బెయిల్ , తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో అల్లు అర్జున్ తీవ్ర మనస్తాపానికి చెందారు.

సంధ్య థియేటర్ ఘటనతో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణలో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీని ప్రభావం సంక్రాంతికి రిలీజైన సినిమాలపై గట్టిగా పడింది. ప్రస్తుతం సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు చిత్ర పరిశ్రమ తంటాలు పడుతోంది. ఇప్పటికే ఆయనతో ఒక రౌండ్ చర్చలను పూర్తి చేసింది చిత్ర పరిశ్రమ. త్వరలో మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలాఉండగా.. పుష్ప 2 బ్లాక్ బస్టర్ కావడంతో అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ తన తదుపరి సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. స్క్రిప్ట్కి ఆల్రెడీ అల్లు అర్జున్ ఓకే చెప్పినట్లుగా ఫిలింనగర్ టాక్. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కొనసాగుతోంది. మరికొద్దిరోజుల్లో ఈ సినిమాను పట్టాలెక్కించాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ పట్టుదలగా ఉన్నాడు.

రామాయణంతో లింక్ ఉండేలా మైథలాజికల్ టచ్ ఉన్న కథను త్రివిక్రమ్ రాసుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కించనున్నారు. ఇందుకోసం కొందరు తెలుగు పండితులతో అల్లు అర్జున్ స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారట. అలాగే తన లుక్ మార్చుకోవడానికి కూడా జిమ్లో కసరత్తులు చేస్తున్నారట . అయితే త్రివిక్రమ్ - అల్లు అర్జున్ మూవీ సంగీత దర్శకుడికి సంబంధించి ఓ న్యూస్ ఫిలింనగర్లో చర్చకు దారి తీస్తోంది.
గతంలో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురానికి తమన్ అదిరిపోయే రేంజ్లో స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డ్ సైతం అందుకున్నాడు. ఆ వెంటనే చేసిన గుంటూరు కారంకు ఆ రేంజ్లో మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు థమన్. అప్పుడే థమన్పై మహేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఫిలింనగర్ టాక్. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీకి థమన్ ప్లేస్లో అనిరుథ్ను తీసుకునే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే అప్పుడు మహేశ్ వద్దు అన్నా థమన్ను వెనకేసుకొచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు అల్లు అర్జున్ను కూడా ఒప్పిస్తాడా? లేక చేతులెత్తేస్తాడా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











