ఎన్టీఆర్ బయోపిక్.... ఆ దర్శకుడు దాదాపు ఖరారైనట్లే, 28న ప్రకటన?
నందమూరి బాలకృష్ణ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'. తన తండ్రి జీవితంపై తెరకెక్కే ఈ సినిమా విషయంలో బాలయ్య ప్రత్యేక దృష్టి పెట్టారు. దర్శకుడు తేజతో స్క్రిప్టు విషయమై చర్చించి అంతా ఓకే అనుకుని సినిమా లాంచ్ అయిన తర్వాత అనుకోని విధంగా అతడు డైరెక్షన్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య, తేజ మధ్య కొన్ని విషయాల్లో పొసగక పోవడం వల్లనే ఇలా జరిగిందని టాక్.
తర్వాత బాలయ్యే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే సినిమాలో నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు భుజానేసుకోవడం చాలా రిస్క్ అని భావించిన బాలయ్య మరో దర్శకుడికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.... బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి అని సమాచారం.

మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమాకు కొత్త దర్శకుడిగా క్రిష్ను ప్రకటిస్తూ బాలయ్య ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. అదే విధంగా ఈ సినిమాలో నటించబోయే ముఖ్యతారాగణం, టెక్నీషియన్ల వివరాలు కూడా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో ఏపీ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వెలువడే ప్రకటన తర్వాత దీనిపై ఓ క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











