హీరోయిన్ లేదనుకున్నారా? ఉంది కనిపిస్తుంది.. సర్ప్రైజింగ్ న్యూస్
తమిళ హీరో కార్తి నటించిన తాజా సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 5న విడుదలైంది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో సాంగ్స్, హీరోయిన్ ఎక్కడా కనిపించక పోవడం విశేషం.
ఏ మాత్రం గ్లామర్ అంశాలకు తావివ్వకుండా ఖైదీ సినిమాను సరికొత్తగా ప్రెజెంట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వల్ రాబోతుందనే వార్త కోలీవుడ్ వర్గాల్లో గుప్పుమంటోంది. ఖైదీ సక్సెస్ టాక్ చూసి ఆనందపడుతున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. రెండో పార్ట్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పైగా ఈ పార్ట్లో ఓ సర్ప్రైజ్ కూడా ఉంటుందట.

మొదటి భాగంలో కనిపించని హీరోయిన్ రెండో భాగంలో కనిపించనుందట. ఇది వరకే కథ సిద్ధం చేసుకున్న డైరెక్టర్ హీరోయిన్ కోసం వేట ప్రారంభించాడట. తన భార్య గర్భవతి అని కూడా చూడకుండా కొందరు దుర్మార్గులు తన ముందే దారుణానికి పాల్పడుతుంటే, వాళ్లలో ఒకరి చంపి తాను జైలుకు వెళ్లానని మొదటి భాగంలో కార్తీ చెప్పడం, అలాగే క్లైమాక్స్ సీన్లో కార్తిని చూసి 'వాడు సంబంధం లేనివాడు కాదురా.. వాడి పేరు ఢిల్లీ' అంటూ విలన్ చెప్పే డైలాగ్ ఖైదీ రెండో భాగం కచ్చితంగా ఉంటుందని హింట్స్ ఇచ్చాయి. ఇప్పుడు కోలీవుడ్ వర్గాలు ఖైదీ సీక్వల్ రానుందని అంటుండటం ఖైదీ 2 ని కన్ఫర్మ్ చేసేశాయి.


Click it and Unblock the Notifications











