ఈ సినిమా మరో అంకుశం అవుతుంది: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్
పోలీస్ నేపథ్యంలో సినిమా అనగానే.. ముందు 'అంకుశం" గుర్తొస్తుంది. ఆ సినిమాతో పోలీస్ పాత్రలకు గౌరవం తెచ్చిపెట్టారు రాజశేఖర్. మళ్లీ 'మహంకాళి" చిత్రంలో ఆయన పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఆయన సతీమణి జీవిత ఈ సినిమాకు దర్శకురాలు. యేలూరు సురేందర్రెడ్డి, ఎం.పరంధామరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ''ఉగ్రవాదుల దుశ్చర్యలను ఓ పోలీస్ అధికారి ఎదుర్కొన్న తీరే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
వాస్తవికతకు పెద్ద పీట వేస్తూ జీవిత ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఆమె సమకూర్చిన స్క్రీన్ప్లే ఈ సినిమాకు హైలైట్"" అన్నారు. ''ఇప్పటి వరకూ ఓ పాట, 70 శాతం టాకీ పూర్తయింది. ఈ నెల 27 నుంచి ఆర్ఎఫ్సీలో చివరి షెడ్యూల్ మొదలవుతుంది. 28 నుంచి రాజశేఖర్, కౌష, జీవా, సలీంపండా తదితరులపై ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తాం.
ఆ తర్వాత నళిని, సత్యప్రకాష్, ప్రభాకర్ తదితరులపై కీలక సన్నివేశాలను తీస్తాం. ఫిబ్రవరి 18 వరకూ జరిగే చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది"" అని జీవిత తెలిపారు. మధురిమ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్, వినోద్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: మోహన్, కెమెరా: అరవింద్, సంగీతం: చిన్నా, నిర్మాణం: అంజేరి ఆర్ట్స్.


Click it and Unblock the Notifications











