SSMB28: త్రివిక్రమ్కు మహేశ్ డెడ్లైన్.. అదే జరిగితే ఫ్యాన్స్కు పండగే
కొన్నేళ్ల క్రితం వరకూ వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టి ఫుల్ ఫామ్లో కనిపించాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అయితే, అతడి గత చిత్రం 'సర్కారు వారి పాట' మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సారి భారీ సక్సెస్పై ఈ బడా హీరో కన్నేశాడు. ఇందులో భాగంగానే తనతో గతంలో రెండు క్లాసిక్ సినిమాలు 'అతడు', 'ఖలేజా'లను తెరకెక్కించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో మూడోసారి జత కట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.
దాదాపు పన్నెండేళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదిలోనే మొదలైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేసుకున్నారు. అయితే, తర్వాత మహేశ్ బాబు ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడం.. అతడు కరోనా వ్యాధి బారిన పడడం వంటి కారణాల వల్ల చిత్రీకరణకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. ఇవి అయిపోయిన తర్వాత కూడా చిత్ర యూనిట్ మరో షెడ్యూల్ను జరిపి.. ఇప్పుడు గ్యాప్ తీసుకుంది.

వరుస బ్రేకుల వల్ల మహేశ్ బాబు - త్రివిక్రమ్ మూవీ ముందుగా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. దీంతో చిత్ర యూనిట్ సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిలిం నగర్లో ఓ హాట్ టాపిక్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. త్రివిక్రమ్కు మహేశ్ మూడు నెలలు డెడ్లైన్ విధించాడట. అప్పటి వరకూ టాకీ పార్టును పూర్తి చేయాలని గట్టిగా చెప్పాడట. దీంతో ఈ సినిమాను ఏకధాటిగా ఒకే షెడ్యూల్లో పూర్తి చేసేలా గురూజీ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇది జూన్ 5వ తేదీ నుంచి మొదలవుతుందట. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రం సంక్రాంతికి రావడం పక్కా అని చెప్పొచ్చు.

మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తోన్నారు.


Click it and Unblock the Notifications











