Chiranjeevi: టాలీవుడ్లో నయా ట్రెండ్.. ఆ బాటలో మెగాస్టార్.. తొలి హీరోగా చిరు రికార్డు ?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణం కేవలం ఒక స్టార్ హీరో కథ మాత్రమే కాదు... అది ఒక స్వయంకృషి చరిత్ర. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, విమర్శలను తట్టుకుని, పరాజయాలను దాటుకుని, ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్గా ఎదిగారు. ఆయన జీవితం ఇప్పటికీ కోట్ల మందికి స్ఫూర్తి. 70 ఏండ్ల వయస్సులో కూడా మెగాస్టార్ టాలీవుడ్లో నయా ట్రెండ్ సెట్ చేయాలని భావిస్తున్నారట. ఇంతకీ మెగాస్టార్ కొత్త బాట ఏంటీ?
1978లో పునాదిరాళ్ళు తో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన చిరంజీవికి మొదటగా విడుదలైన సినిమా ప్రాణం ఖరీదు. తొలి చిత్రం ప్లాప్ అయినా, మేకప్ లేకుండా చేసిన సహజ నటన అప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మన ఊరి పాండవులు సినిమా చిరంజీవికి నటుడిగా గుర్తింపు తెచ్చింది. చిన్న పాత్రల నుంచి విలన్ రోల్స్ వరకు చేస్తూ, ఆయన ప్రయాణం నెమ్మదిగా కానీ గట్టిగా సాగింది.

ఇక 1980లలో చిరంజీవి కెరీర్ గోల్డెన్ ఫేజ్లోకి అడుగుపెట్టింది. మొగుడు కావాలి ఆయనకు తొలి సిల్వర్ జూబ్లీ. ఆ తర్వాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా తనవైపు తిప్పుకున్నారు. శుభలేఖ సినిమాతో చిరంజీవి తొలి ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకోవడం విశేషం. కానీ చిరంజీవి కెరీర్ను మలుపుతిప్పిన సినిమా మాత్రం 1983లో విడుదలైన ఖైదీ. కమర్షియల్ సినిమాలకు కొత్త అర్థం చెప్పిన ఈ సినిమా చిరంజీవిని ఓవర్నైట్ సూపర్స్టార్గా మార్చింది. ఒక నటుడికి, స్టార్డమ్కు మధ్య ఉన్న గీతను చెరిపేసిన సినిమా ఇదే. అప్పటి నుంచి చిరంజీవి వెనుదిరిగి చూసుకోలేదు.
అయితే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే 2007లో శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తిరుపతిలో నిర్వహించిన తొలి సభకు లక్షలాది మంది తరలిరావడం చిరంజీవి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చూపించింది. అయితే రాజకీయ ప్రయాణం అంతగా కలిసి రాలేదు. తర్వాత ఆయన మళ్లీ సినిమాలవైపు మొగ్గు చూపారు.
దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత 2017లో ఖైదీ నెం.150తో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చారు. యంగ్ హీరోల మధ్య చిరు ఇమేజ్ నిలబడుతుందా? అన్న సందేహాలకు ఈ సినిమా బాక్సాఫీస్ సమాధానం చెప్పింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి, మెగాస్టార్ స్టామినాను మరోసారి నిరూపించింది.ఇక తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, చిరంజీవి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది.
ఇలాంటి సందర్భంలోనే టాలీవుడ్లో పెరుగుతున్న పాడ్కాస్ట్ కల్చర్పై చిరంజీవి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా సెలబ్రెటీలు తమ అనుభవాలు, అభిప్రాయాలు స్వేచ్ఛగా పంచుకునేందుకు పాడ్కాస్ట్లను ఎంచుకుంటున్నారు. ఈ ట్రెండ్ను ముందే అందిపుచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ పాడ్కాస్ట్లు ప్రత్యేక ఫ్యాన్ బేస్ను సృష్టించాయి. ఇప్పుడు అదే బాటలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాడ్కాస్ట్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
'మన శంకర వరప్రసాద్ గారు' బ్లాక్బస్టర్ విజయం అనంతరం, బుధవారం సాయంత్రం తన నివాసంలో మీడియా మిత్రులతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని చిరంజీవి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ పాడ్కాస్ట్ ఆలోచనకు చిరు కూతురు సుష్మిత కొణిదెల, అలాగే రైటర్-డైరెక్టర్ బీవీఎస్ రవి సన్నాహాలు చేస్తున్నారని టాక్.
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో మూడు తరాల నటీనటులు, టెక్నీషియన్లతో కలిసి పని చేసిన చిరంజీవి అనుభవాలు అసంఖ్యాకం. అయితే ఆయన సాధారణంగా ఇంటర్వ్యూల్లో గతం గురించి ఎక్కువగా మాట్లాడరు. అందుకే పాడ్కాస్ట్ రూపంలో జీవితం నేర్పిన పాఠాలు, సినీ ప్రయాణంలో ఎదురైన సంఘటనలు, వ్యక్తిగత అనుభవాలను అభిమానులతో పంచుకోవాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.
గతంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు యాంకర్ సుమతో చేసిన టీవీ కార్యక్రమానికి ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే. చిరు పాడ్కాస్ట్ ఆ స్థాయిని మించి స్పందన తెచ్చుకునే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ మెగాస్టార్ పాడ్కాస్ట్ నిజమైతే, అది టాలీవుడ్లో మరో నయా ట్రెండ్కు నాంది పలికినట్లే అవుతుంది. అలాగే.. ఇప్పటి వరకూ టాలీవుడ్ ఏ హీరో కూడా పాడ్ కాస్ట్ చేసిన చరిత్ర లేదు.


Click it and Unblock the Notifications











