MM Keeravani: ఆ ఇంటికి అల్లుడు కాబోతున్న కీరవాణి కొడుకు..?
శ్రీ సింహా ఇలా పిలిస్తే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కోడూరి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కుర్రాడు హీరోగా పరిచయమై చాలా కాలమే అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు. ఆ మధ్య మత్తు వదలరా మూవీలో హీరోగా చేసి మెప్పించాడు. ఆ సినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ, హీరోగా తన ప్రతిభను కనబరిచే ప్రయత్నం చేస్తున్నాడు.
కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ తండ్రి బాటలో పయనిస్తూ సంగీత దర్శకుడిగా, సింగర్ గా రాణిస్తున్నాడు. చిన్న కొడుకు శ్రీ సింహా మాత్రం సంగీతం వైపు కాకుండా, నటన వైపు అడుగులు వేశాడు. తన బాబాయ్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాల్లో బాల నటుడిగా పలు సినిమాల్లో చేశాడు శ్రీ సింహా. మత్తు వదలరా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 'తెల్లవారితే గురువారం', 'దొంగలున్నారు జాగ్రత్త', 'భాగ్ సాలే' వంటి సినిమాల్లోనూ నటించాడు శ్రీ సింహా. ఇటీవలె 'ఉస్తాద్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ కుర్ర హీరో త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడట. అది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాగా పరిచయం ఉన్న సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఇంటికి అల్లుడు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు అయిన మాగంటి మురళీ మోహన్ మనుమరాలితో కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మురళీ మోహన్ కు ఒక కుమార్తెతో పాటు రామ్మోహన్ అనే కుమారుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. రామ్మోహన్ కూతురు అయిన మాగంటి రాగను శ్రీ సింహాకు ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అటు కోడూరి, ఇటు మాగంటి కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారని, వచ్చే సంవత్సరం పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మాగంటి రామ్మోహన్, రూప దంపతుల కుమార్తె అయిన మాగంటి రాగ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమె మాగంటి కుటుంబానికి ఏకైక వారసురాలు. ఈ మధ్యే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మాస్టర్స్ పూర్తి చేసినట్లు సమాచారం. త్వరలోనే మురళీ మోహన్ కు చెందిన వ్యాపారాల బాధ్యతలను చేపట్టనుందని అంటున్నారు. కీరవాణి, మురళీ మోహన్ కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయన్న ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
ఈ వార్తలపై అటు మాగంటి కుటుంబ సభ్యుల నుంచి గానీ, ఇటు కోడూరి ఫ్యామిలీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ రెండు ప్రముఖ కుటుంబాల గురించిన వార్త కావడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











