హాట్ టాపిక్: టీడిపితో పవన్ కళ్యాణ్ పొత్తు...షరతులు
హైదరాబాద్: పార్టీని స్థాపించకముందే పవన్ కల్యాణ్ మీడియాలో,బయిటా ప్రభంజనం సృష్టిస్తున్నారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలలోనూ పవన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న దృష్ట్యా ఆయన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశంలోని ఒక వర్గం కూడా సుముఖంగానే ఉన్నట్లు వినికిడి. ఈ మేరకు టీడిపీ క్రైసెస్ మేనేజ్ మెంట్ టీమ్ రంగంలోకి దిగిందని చెప్తున్నారు. సీఎం రమేష్, గంటా శ్రీనివాసరావు పవన్ ని కలిసి డిస్కస్ చేసారని తెలుస్తోంది.
తెలుగు దేశం లో చేరాలని పవన్ను ఆ పార్టీ నేతలు ఆహ్వానించినట్లు సమాచారం.చివరికి టీడీపీతో తాను పొత్తు కుదుర్చుకోవాలంటే కొన్ని షరతులు అంగీకరించాలనీ, అలాగైతేనే ఆ పార్టీతో సయోధ్య విషయం ఆలోచిస్తానని పవన్ టీడీపీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకే అశ్వనీదత్ మీడియా ముందు పవన్ పార్టీ గురించి మాట్లాడినట్లు చెప్తున్నారు.

టీడీపీ, పవన్ స్థాపించనున్న పార్టీల మధ్య సిద్ధాంతాలు దాదాపు ఒకటే కావడంతో టీడీసీలోకి వస్తే సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని ఆ పార్టీ నేతలు పవన్ను ఆహ్వానించారు. అయితే, టీడీపీపై తనకు సదభిప్రాయమే ఉన్నప్పటికీ తానే సొంతంగా పార్టీ పెడుతున్నందున టీడీపీలోకి రాలేనని పవన్ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, పవన్కు ఉన్న ప్రజాదరణ దృష్ట్యా ఎలాగైనా ఆయనను పార్టీలోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో పట్టువిడవకుండా చర్చలు జరిపి, చివరకు టీడీపీ నేతలకు 4 షరతులు విధించినట్లు తెలుస్తోంది.
తన పార్టీకి పొత్తులో భాగంగా 15 అసెంబ్లీ సీట్లు కేటాయించాలనీ, ఈ సారి జరిగే ఎన్నికలలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలలో బహుముఖ పోటీ ఉండే అవకాశం ఉన్న దష్ట్యా రెండు ప్రాంతాలలో ప్రచారానికి భారీగా ఆర్థిక వనరులు అవసరం అవుతాయనీ, దానిని టీడీపీనే కల్పించాలని షరతు విధించినట్లు సమాచారం. దీనికి తోడు తనకు రెండు ఎంపీ సీట్లను కేటాయించాలని కూడా టీడీపీ నేతలను కోరినట్లు సమాచారం.
వీటిలో ఒకటి కాకినాడ కాగా, మరొకటి విజయవాడ సీటును పొట్లూరి వరప్రసాద్ (పివిపి)కు టీడీపీ పక్షాననే కేటాయించాలన్న షరతు విధించినట్లు తెలుస్తోంది. తాను విధించిన నాలుగు షరతులకు అంగీకరించినట్లయితే టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని పవన్ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉండగా, టీడీపీతో పొత్తుకు పవన్ విధించిన షరతులు మరీ ఇబ్బంది పెట్టే విధంగా లేవనీ, అందువల్ల వాటికి అంగీకరిస్తే వచ్చే ఎన్నికలలో పార్టీకి ఆశించిన మేర ప్రయోజనం కలుగుతుందని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలలోనూ పవన్ కల్యాణ్కు ఉన్న భారీ ఫాలోయింగ్ దృష్ట్యా ఆయనతో పొత్తు కుదుర్చుకోవడమే మేలని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక 'రాజకీయం ఎలా ఉండాలి? పేదలకు ఏం చేయాలి? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎలా వ్యవహరించాలి?' అనే అంశాలపై తన ఆలోచనలకు అనుగుణంగా పవన్ పార్టీ రూపుదిద్దుకుంటోంది. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశంకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ పొలిటికల్ ఎంట్రీ, రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 'రాజకీయాలపై మార్చి రెండో వారంలో మాట్లాడతాను' అని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు... మరో వారంలో ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications











