నా రామాయణం కామెడీనో..పేరడీనో కాదు..‘నాట్ ఏ జోక్...బీ సీరియస్': వర్మ
ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ .... తన తాజా చిత్రం గురించి 'నాట్ ఏ జోక్...బీ సీరియస్' అంటున్నారు. వర్మ 'రామాయణం' సినిమా తీయబోతున్నట్లు ప్రకటన చేసినప్పటి నుంచి అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే వాటిపై ఆయన స్పందిస్తూ ...
నేను నా స్టైల్ లో రామాయణం తీయబోతున్నానని ప్రకటించినప్పటి నుంచీ చాలామంది అది ఒక పేరడీగానో, ఒక కామెడీగానో తీయబోతున్నానని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నా రామాయణం చాలా హూందాగా, చాలా సీరియస్ గానూ ఉంటుంది. 'సర్కార్' సినిమాలా ఫ్యామిలీ థ్రిల్లర్ ను పోలి ఉంటుంది...అని అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. తన తాజా చిత్రం రామాయణంపై పలు కామెంట్లకు సమాధానంగా సోమవారంనాడు మరొక ప్రకటన విడుదల చేశారు.
'రామాయణం కథ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటూనే ఉన్నాను ఏ కారణం చేత ఎవరు ఈ కథను అంతగా గౌరవించారు. అనే విషయాన్ని చాలాసార్లు విశ్లేషించాను కూడా. ఈ కారణంగానే రామాయణాన్ని నా స్టైయిల్లో తీయాలన్న కోరిక కలిగింది. కానీ నా రామాయణం కథ జరిగేది త్రేతాయుగంలో కాదు. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో. హైదరాబాద్లో రామాయణంలోని పాత్రలు వుంటే… ఆ రామాయణం ఎలా ఉంటుంది? అనే ఆలోచనలోంచి వచ్చిందే ఈ కథ" అని చెప్పారు వర్మ
'దశరథరావు పెద్ద కుమారుడు రామ్ శంకర్. అయోధ్య గ్రూప్ కీ సంబంధించిన ఒక యూనిట్ వనస్థలిపురంలో ఉంటుంది. అది నష్టాల్లో ఉంటుంది. దాన్ని రామ్ శంకర్ టేకప్ చేస్తాడు. పంచవతి మినరల్ వాటర్స్ లో ఒక కొత్త యూనిట్ ఓపెనింగ్ సందర్భంగా ఇచ్చిన పార్టీకి శూర్పణ కూడా వస్తుంది. శూర్పణ ఆ పార్టీలో సీతాలక్ష్మితో ప్రవర్తించిన తీరుతో నా 'రామాయణం' మొదలవుతుంది' అని వర్మ తన ప్రకటనలో పేర్కొన్నారు.
బాపు తీసిన 'శ్రీరామరాజ్యం" ఇప్పుడు ప్రదర్శితమవుతోన్న సందర్భంలో రాము-ఈ సరికొత్త రామాయణానికి ఆలోచన చేయడం గమనార్హం. మరి ఈ కలియుగ రామాయణం ఎన్ని వివాదాలు, విమర్శలకు దారి తీస్తుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











