నాగ చైతన్య కొత్త చిత్రం..'ఒక లైలా కోసం...'
హైదరాబాద్ : నాగచైతన్య హీరోగా 'గుండెజారి గల్లంతయ్యిందే' దర్శకుడు విజయకుమార్ కొండా దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ పతాకంపై నాగార్జున అక్కినేని ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రానికి 'ఒక లైలా కోసం...' అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. ఈ పాట అక్కినేని నాగేశ్వరరావు...రాముడు కాదు కృష్ణుడు చిత్రంలో పాట.
దర్శకుడు విజయ్కుమార్ కొండా మాట్లాడుతూ... ''ఎనిమిది నెలలపాటు శ్రమించి కథను సిద్ధం చేశాం. 'గుండె జారి గల్లంతయ్యిందే' కంటే రెండింతలు ఎక్కువ వినోదం ఉంటుంది. సినిమా చూశాక బంధువుల పెళ్లికి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది. నాగచైతన్యని తెరపై కొత్త తరహాలో చూపించబోతున్నాం. వచ్చే నెల రెండోవారంలో చిత్రాన్ని ప్రారంభించబోతున్నాము''అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతః నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: విజయకుమార్ కొండా.

అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్కి నాగచైతన్య పచ్చజెండా ఊపారు. 'అత్తారింటికి దారేది' లాంటి బ్లాక్బస్టర్ని అందించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి 'స్వామి రారా' ఫేం సుధీర్ వర్మ దర్శకుడు. ఈ ఏడాది విడుదలైన చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచిన సినిమా 'స్వామి రారా'. తొలి సినిమాతోనే దర్శకునిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న సుధీర్వర్మ... నాగచైతన్యతో చేయబోతున్న సినిమా క్కూడా ఓ భిన్నమైన కథాంశాన్నే ఎంచుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి తొలివారంలో కానీ ఈ సినిమా మొదలవుతుందని తెలిసింది.
'తడాఖా'తో మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి జోష్ మీదున్న నాగచైతన్య... సినిమాలు చేసే విషయంలో కాస్త జోరు పెంచారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ సినిమా 'మనం' షూటింగ్లో బిజీగా ఉన్నారు చైతు. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన నటించిన 'ఆటోనగర్ సూర్య' చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23న చైతు పుట్టిన రోజు సందర్భంగా 'ఆటోనగర్ సూర్య' ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నారు.
ఇదిలావుంటే... నాగచైతన్య ఇప్పుడు మరో రీమేక్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. పంజాబీలో విజయవంతమైన 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. అందులో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తారు. మొదట ఈ చిత్రంలో రానా నటిస్తారని ప్రచారం సాగింది. అయితే ఈ కథరీత్యా చైతన్య అయితేనే బాగుంటుందని నిర్ణయించారు. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్మాత డి.రామానాయుడు తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ''పంజాబీలో 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రాన్ని నేనే నిర్మించాను. ఆ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. ఇప్పుడు తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతాం. కథాచర్చలు తుదిదశకు చేరుకొన్నాయి. వచ్చే నెలలో చిత్రీకరణని మొదలుపెడతాం. దర్శకుడు ఎవరనేది త్వరలోనే చెబుతాము''అన్నారు. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించే అవకాశం ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











