17 ఏళ్ల తర్వాత బాలయ్యతో ఆ హీరోయిన్ రొమాన్స్? కొరటాల ప్లానింగ్ అదిరిపోయిందిగా.!
66 ఏళ్ల వయసులో కుర్రాళ్లను మించిన వేగంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. అఖండ 2 తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గోపీచంద్ మలినేనితో సినిమాను పట్టాలెక్కించిన ఆయన.. ఈ మూవీ చేస్తూనే దానితో సమాంతరంగా మరో సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. సీనియర్ దర్శకుల కంటే కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలని బాలకృష్ణ భావిస్తున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు సీనియర్లు, జూనియర్లు క్యూకడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ కొరటల శివతో మూవీకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ మూవీ క్యాస్టింగ్ కూడా సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
గోపీచంద్ మలినేని మూవీలో బాలకృష్ణ ఓ చారిత్రక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాలతో కథను మొత్తం మార్చేసి యాక్షన్, మాఫియా బ్యాక్డ్రాప్లోకి మార్చారు. ఈ సినిమాలో బాలకృష్ణ ఓ పవర్ఫుల్ మాఫియా డాన్గా కనిపించబోతున్నారట. బాలయ్య మార్క్ డైలాగులు, భారీ యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సినిమాను గోపీచంద్ తెరకెక్కిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో నయనతార, కాజల్ అగర్వాల్లు హీరోయిన్లుగా నటించనున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

గోపీతో సినిమా చేస్తూనే వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి యంగ్ డైరెక్టర్స్కి బాలకృష్ణ అవకాశం ఇచ్చినట్లుగా ఫిలినగర్ టాక్. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వివేక్. ఈ క్రమంలోనే వివేక్ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపీచంద్ మలినేని సినిమా సెట్స్పై ఉండగానే.. ఈ సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని బాలకృష్ణ భావించారు. అయితే అనివార్య కారణాలతో వివేక్ ఆత్రేయతో మూవీని బాలయ్య పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇంతలోనే మరో యువ దర్శకుడు విజయ్ కనకమేడల మూవీకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి. నాందీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. బాలయ్య కోసం ఓ పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేయడంతో దానికి నట సింహం పచ్చజెండా ఊపేశారు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తారనిర త్వరలోనే సినిమా సెట్స్ మీదకి వెళ్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీన్లోకి కొరటాల శివ వచ్చారు. కొరటాల కథ నచ్చడం దానికి బాలయ్య ఓకే చెప్పడమే కాదు.. ఏకంగా మే 1న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.
పవర్ఫుల్ యాక్టింగ్కు పెట్టింది పేరైన బాలయ్యతో కొరటాల మార్క్ టేకింగ్ తోడైతే రికార్డులు గల్లంతేనని సినీ జనాలు చెబుతున్నారు. నిజానికి ఎన్టీఆర్తో దేవర 2ను తెరకెక్కించాలని కొరటాల వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ షూటింగ్లో ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో ఈ గ్యాప్లో బాలయ్య కోసం పవర్ఫుల్ కథ రాసుకున్నారట కొరటాల. 2027 సంక్రాంతి నాటికి ఈ సినిమాను పూర్తి చేయాలని కొరటాల కూడా పట్టుదలతో ఉన్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్యకు హీరోయిన్గా సీనియర్ నటి ప్రియమణిని కన్ఫర్మ్ చేసినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. గతంలో 2009లో బాలయ్య- ప్రియమణి జంటగా మిత్రుడు అనే సినిమాలో నటించారు. మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఈ జంట మరోసారి జోడీ కట్టనుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications