బాలకృష్ణ దర్శకత్వం లో నయనతార ప్రధానపాత్రలో...
ప్రభుదేవాతో ప్రేమ ప్రక్కకు వెళ్లటంతో నయనతార వరసగా సినిమాలు కమిటవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నర్తనశాల రీమేక్ లో ద్రౌపది పాత్ర చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. బాలకృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే మళ్లీ ప్రారంభమవుతుందని చెప్తున్నారు. శ్రీరామరాజ్యం నిర్మాతలే ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నారని ఫిల్మ్ నగర్ న్యూీస్.
ఇక బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామ రాజ్యంలో సీత అమ్మవారిగా అందరి మన్ననలు అందుకోవటంతో బాలకృష్ణ ఆమెను ఈ పాత్రకు అడిగారని చెప్తున్నారు. సీతగా కరుణ రసభరిత పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలందుకున్న నయనతార ఆ సినిమా విజయంలో ప్రధాన పాత్ర వహించింది. దాంతో బాలయ్య మరో పౌరాణిక చిత్రం 'నర్తనశాల'లో ద్రౌపదిగా ఆమెను తప్ప వేరే వారిని ఊహించుకోలేక పోతున్నారని చెప్తున్నారు. దాదాపు పదేళ్ల క్రితం వార్తల్లో ఉన్న ఈ నర్తనశాలలో దివంగత నటి సౌందర్య ఈ పాత్రలో కనిపిస్తుందని పేర్కొన్నప్పటికీ ఈమె మరణంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
అప్పటినుంచి ద్రౌపదిగా చేయటానికి సరైన నటి దొరికితేనే ఆ ప్రాజెక్టుని కొనసాగించే ఆలోచనలో బాలయ్య ఉన్నారు. ఇప్పుడు శ్రీరామరాజ్యంలో నయనతార నటన పట్ల సంతృప్తి చెందిన బాలకృష్ణ మళ్ళీ నయనతార ద్రౌపదిగా నర్తనశాలపై దృష్టి పెడతారని తెలిసింది. ఇదే విషయాన్ని బాలయ్య గతంలోనే నయనతారను అడిగినప్పుడు అప్పట్లో ప్రభుదేవాతో ఈమె పెళ్ళి ప్రయత్నాలు జోరుగా సాగుతుండటంతో ఆమె ఏమీ చెప్పలేకపోయింది. ఇప్పుడు ప్రభు,నయనల మధ్య అనుకోని ఎడబాటుతో ఈమె మళ్ళీ పలు సినిమాల్లో నటిస్తూ నర్తనశాలకు కూడా ఓకే చెప్పిందని చెప్తున్నారు.
ప్రస్తుతం ఆమె రానా,క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'కృష్ణం వందే జగద్గురుం'లో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. అలాగే తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ చిత్రం పంజాతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు విష్ణు వర్దన్ సినిమా కమిటైంది. అజిత్,ఆర్య కాంబినేషన్ లో రూపొందే ఈ చిత్రం నయనతార కీ రోల్ చేయనుంది.


Click it and Unblock the Notifications