Spirit: ప్రభాస్కు జోడీగా స్టార్ హీరోయిన్.. 15 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్తో అతడు కూడా పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని ఈ హీరో.. ఇండియన్ సినిమాను శాసించే దిశగా దూసుకెళ్తోన్నాడు. ఇందులో భాగంగానే వరుసగా పాన్ ఇండియా రేంజ్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ప్రస్తుతం అతడు 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్టు K' చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన 25వ సినిమాను కూడా ప్రకటించాడు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా కాలమే అవుతోన్నా.. ప్రభాస్ వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది.

'స్పిరిట్' మూవీ భారీ యాక్షన్ బ్యాగ్డ్రాప్తో రూపొందనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే టైటిల్పై స్టార్స్ ఉండడంతో ఇది పోలీస్ కథతో వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టును సందీప్ రెడ్డి వంగా ఆమెకు వినిపించాడట. ఇది బాగా నచ్చడంతో ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. గతంలో వీళ్లిద్దరూ 'యోగి' మూవీలో జంటగా కనిపించారు.
క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'స్పిరిట్' మూవీలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విలన్గా నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. అలాగే, ఎంతో మంది ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











