NBK 111: నయనతార ఔట్.. బాలయ్యకు జోడీగా ఆ యంగ్ హీరోయిన్?
66 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో ఢీ అంటే ఢీ అంటున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. అఖండతో మొదలుపెట్టి భగవంత్ కేసరి, డాకు మహారాజ్, వీరసింహారెడ్డిలతో వరుసగా నాలుగు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఈ జోరుకు అఖండ 2 బ్రేక్ వేసింది. తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
గతంలో తనకు వీరసింహారెడ్డి వంటి హిట్ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ మరోసారి జతకట్టారు. ఇది బాలయ్య కెరీర్లో 111వ సినిమా కావడం విశేషం. కానీ ఏం జరిగిందో ఏమో కానీ NBK 111కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా బాలయ్య సినిమాకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని మేకర్స్ భావించారు. కానీ ఆదిలోనే ఈ సినిమాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.

తొలుత పీరియాడికల్, హిస్టరీ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం ఉంటుందని వార్తలు వచ్చాయి. పోస్టర్స్, గ్లింప్స్లోనూ కత్తులు, కోటలు కనిపించడంతో ఇది నిజమేనని అనుకున్నారు. బాలయ్యను ఎన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించేందుకు గోపీచంద్ పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేశారని వార్తలు వచ్చాయి. కానీ ఏం జరిగిందో ఏమో కానీ దర్శక, నిర్మాతలు, హీరో కలిసి స్క్రిప్ట్ విషయంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. హిస్టారికల్ స్టోరీ కాకుండా మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఫిలింనగర్ టాక్ ప్రకారం.. NBK 111 కథ విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గడానికి కారణం ఖర్చు అని తెలుస్తోంది. ఈ సినిమాను తొలుత 170 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే అఖండ 2 భారీ నష్టాలను మిగల్చడం, ఓటీటీల నుంచి గతంలో మాదిరిగా ఆదాయం రాకపోవడంతో ఈ స్థాయి బడ్జెట్తో వెళితే వర్కవుట్ అవుతుందా? అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందుకే ముందు అనుకున్న స్క్రిప్ట్ మార్చేసి దాని స్థానంలో మరో కొత్త కథను సిద్ధం చేశారట. ముంబై బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ మూవీగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.
తాజాగా NBK111కి సంబంధించి మరో గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేడీ సూపర్స్టార్ నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె స్థానంలో మరో హీరోయిన్ని కూడా ఎంపిక చేసినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదు.. యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి. ఇప్పటికే సీనియర్ హీరో రవితేజ సరసన పలు చిత్రాల్లో తన అందం, నటనతో ఆకట్టుకుంది డింపుల్. కానీ ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ రాలేదు. అలాంటిది బాలయ్య వంటి అగ్రనటుడి సరసన నటించే అవకాశం రావడంతో డింపుల్ గాల్లో తేలిపోతోందట.
అయితే మరో వార్త ప్రకారం.. ఈ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ కాగా.. డింపుల్ సెకండ్ హీరోయిన్గా నటించనున్నారట. సెకండాఫ్లో డింపుల్ పాత్ర ఉంటుందని చెబుతున్నారు. కాగా.. డింపుల్ను బాలయ్యకి హీరోయిన్గా ఎంపిక చేశారంటూ వస్తున్న వార్తలపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మంచి హైప్ ఉన్న సినిమాను చెడగొట్టడం ఎలానో ఎన్బీకే 111 మేకర్స్ని చూసి బాగా నేర్చుకోవచ్చు. డింపుల్ హయాతిని హీరోయిన్గా తీసుకోవడం బ్లండర్ మిస్టేక్. ఆమె బదులు రవీనా టాండన్ను తీసుకుంటే బాగుండేది అంటూ ఓ నెటిజన్ దారుణంగా కామెంట్స్ చేశాడు. ఈ విషయం దర్శకుడు గోపీచంద్ మలినేని దృష్టికి రావడంతో ఆయన సీరియస్ అయ్యారు. సూపర్స్టార్ మహేశ్ బాబు ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. అందులో మీకు ఎవరైనా చెప్పారా? నేనైతే చెప్పలేదు అంటూ అంటారు మహేశ్. ఇదే అర్ధం వచ్చేలా సెటైరికల్గా కౌంటర్ ఇచ్చారు గోపీచంద్.


Click it and Unblock the Notifications


















