NBK 112: నందమూరి ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్? బాలయ్యతో మూవీకి వివేక్ ఆత్రేయ క్రేజీ ప్లాన్!
66 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లను మించి దూసుకెళ్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. గతేడాది అఖండ 2తో పలకరించిన బాలయ్య.. ఈసారి సంక్రాంతికి బెర్త్ కన్ఫర్మ్ చేసేశారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తున్నారు. ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ని వేగంగా పూర్తి చేసే ప్లాన్లో బాలయ్య ఉన్నారు. ఈ సినిమా ముగిసిన వెంటనే యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరి కాంబోకు సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు వివేక్ ఆత్రేయ. నానితో సరిపోదా శనివారం తీసిన తర్వాత రెండేళ్లుగా ఆయన కొత్త ప్రాజెక్ట్ ఏది అనౌన్స్ చేయలేదు. అయితే వివేక్ చెప్పిన కథ.. బాలయ్యకు నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫిలింనగర్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య కెరీర్లో 112వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుండగా.. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది.

మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే యువ దర్శకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బాలకృష్ణ కొత్త కుర్రాళ్లతో సినిమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వివేక్ ఆత్రేయ కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబోపై టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. విలక్షణమైన కథలతో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ.. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి బాలయ్యతో ఎలాంటి సినిమా చేస్తారు? కథ ఎలా ఉండనుంది? బాలయ్యని ఎలా చూపించనున్నారు? అంటూ ఫిలింనగర్లో చర్చ మొదలైంది.
ఇక ఈ క్రేజీ కాంబోకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. బాలయ్య - వివేక్ ఆత్రేయ సినిమాకు కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ను ఫిక్స్ చేసినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. టైటిల్ను బట్టి ఇది మైథలాజికల్ సినిమానా? లేక మాస్ ఎంటర్టైనరా అన్నది మాత్రం తెలియరాలేదు. మైథలాజికల్ సినిమాలు బాలయ్యకు కొట్టినపిండి అన్నది తెలిసిందే. ప్రస్తుతం ఫాంటసీ, మైథలాజికల్ సినిమాలకు డిమాండ్ బాగున్న నేపథ్యంలో ఈ దిశగా ఆలోచన చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే బాలకృష్ణను మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా చూపించేందుకు వివేక్ ఆత్రేయ ప్లాన్ చేస్తున్నారట.
కాగా.. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నట్లుగా ఫిలింనగర్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కథ పెద్దగా ఉండటంతో పాటు తను చెప్పాలనుకున్న పాయింట్ని వివరంగా చెప్పేందుకు రెండు భాగాలుగా సినిమాను తీయాలని వివేక్ ఆలోచిస్తున్నారట. దీనికి బాలకృష్ణతో పాటు నిర్మాతల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా తెలుస్తోంది. దసరా తర్వాత వివేక్ ఆత్రేయ- బాలకృష్ణ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ తర్వాతే అన్ని విషయాలపై క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications

















