పవన్కళ్యాణ్ దర్శకత్వం చేయబోతున్నారా...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'మెగాఫోన్" పట్టుకోనున్నారు. అంటే డెరైక్టరు కాబోతున్నారన్నమాట. అయితే ఇది వెండితెర మీదనే సుమా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్న ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో పవన్ కళ్యాణ్ ఆ విధంగా నటించబోతున్నట్లు తెలిసింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న ఈ చిత్రం తొలిషెడ్యూల్ ఇజ్రాయెల్ లోని జెరూసలేంలో జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ఒక అగ్రకథానాయిక నటిస్తున్నట్లు కూడా సమాచారం.
తన పాత్ర కోసం పవన్కళ్యాణ్ ఎంతో శ్రద్ధ తీసుకుని, 50 రోజుల పాటు షూటింగులో పాల్గొంటారని కూడా సమాచారం. జె.కె.భారవి, సింగీతం శ్రీనివాసరావు, కొండా కృష్ణంరాజు గత రెండేళ్ల నుంచి ఈ చిత్ర కథను తయారుచేయడం విశేషంగా పేర్కొనాలి. ఇప్పటి వరకు తను చేసిన చిత్రాలకు పూర్తిభిన్నంగా, 8 నెలల నుంచి రచయిత, దర్శక, నిర్మాతలతో ఇంటరాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం మీద చూపెడుతున్న ఆసక్తిని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ పోషించే పాత్రను హిందీలో ఒక అగ్ర కథానాయకుడు చేయబోతున్నట్లు తెలిసింది. ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











