పవన్ పోటీ మల్కాజిగిరి నుంచి కాదు!

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఖాయమైంది. 'జన సేన' పేరుతో రాజకీయ పార్టీ స్థాపించనున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగే బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే విషయమై అభిమాన సంఘాల నేతలు, సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలోని కొందరు మేధావులతో చర్చించారు.
పార్టీ పెట్టాలా? స్వతంత్రంగా పోటీ చేయాలా? ఏదైనా పార్టీలో చేరాలా? అన్నదానిపై చర్చలు జరిగాయి. చివరకు సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించారు. అభిమానుల నడుమ హైటెక్స్లో జరిగే బహిరంగ సభలో పవన్ ఈ విషయం చెప్పనున్నారు. ఇప్పటికే హైటెక్స్లో సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు చేయాల్సిన ప్రసంగం పైనా పవన్ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారని సమాచారం.
రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నది? ఆశయాలు? లక్ష్యాలు ఏంటి? ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలను కూడా ఇందులో స్పృశించనున్నారు. 45 నిమిషాల సేపు ఆయన ప్రసంగం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా ఆయన పార్టీ పెడుతున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ బుధవారమిక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీకి ఏ పేరు పెట్టాలన్న దానిపైనా పలు చర్చలు జరిగాయి. జనం కోసం పార్టీ పెడుతున్నందున 'జన సేన' అంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అదే పేరు ఖరారు చేశారని తెలిసింది.


Click it and Unblock the Notifications











