పవన్ కల్యాణ్ అనూహ్య నిర్ణయం.. వారికి ఇక షాకే!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకొన్నారు. తన భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను తిప్పి పంపించడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయ పర్యటనల్లో భాగంగా తాను పలు జిల్లాల సందర్శనకు వెళ్తున్నానని, కావున తనకు సెక్యూరిటీ కల్పించాలని గతనెల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. పవన్ లేఖకు స్పందించిన ప్రభుత్వం.. ఆయనకు నలుగురు గన్మెన్లను కేటాయించింది.

గన్మెన్ల భద్రత
పవన్ కల్యాణ్ అభ్యర్థన మేరకు ఇటీవల ఏపీ ప్రభుత్వం 2+2తో నలుగురు గన్మెన్లతో భద్రతను కల్పించింది. అయితే తాజాగా గన్మెన్ల అవసరం లేదని మంగళవారం రాత్రి తిప్పి పంపడం పవన్ నిర్ణయం తీసుకోవడం మీడియాలో ప్రముఖ వార్తగా మారింది.

జనసేన సమాచారం లీక్
గన్మెన్లను వెనుకకు పంపడంపై వెనుక కారణాలను జనసేన పార్టీ గానీ, పవన్ కల్యాణ్ గానీ వెల్లడించలేదు. కానీ ఆ వ్యవహారంపై అనేక రకాల కథనాలు మీడియాలో వైరల్గా మారాయి. జనసేన పార్టీ వ్యవహారాలను బయటకు గన్మెన్లు లీక్ చేస్తున్నారనే అనుమానం రావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కథనాల్లో పేర్కొన్నారు.

స్పందించని ఏపీ ప్రభుత్వం
గన్మెన్ల ద్వారా ఏపీ ప్రభుత్వం సమాచారాన్ని తెలుసుకొంటున్నట్టు పార్టీ వర్గాలు భావించాయట. ఆ క్రమంలోనే గన్మెన్లను తిప్పి పంపిస్తూ ఏపీ డీజీపీ మాలకొండయ్యకు పవన్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం దీనిపై ఇంకా స్పందించలేదు.

పవన్ అనూహ్య నిర్ణయం
భద్రత కోసం నియమించిన సెక్యూరిటీ సిబ్బందిని ప్రభుత్వం మరోరకంగా ఉపయోగించుకొంటుందనే అభిప్రాయం జనసేన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. కొన్ని పార్టీల నేతలు సెక్యూరిటీ సిబ్బందిని సమాచారం చేరవేసే వేగులుగా వాడుకుంటున్నారనే అనుమానం రావడంతో పవన్ అనూహ్య నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











